భారత జట్టులో ఖాళీ లేకపోవడంతోనే వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్కు అవకాశం దక్కలేదని టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. ప్రస్తుత భారత జట్టులో ఎవర్నీ పక్కనపెట్టలేని పరిస్థితి అని, జట్టులో ఉన్న ఆటగాళ్లంతా నిలకడగా రాణిస్తున్నారని తెలిపాడు. ఇటీవల ముగిసిన విజయ్ హాజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ అసాధారణ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. 9 మ్యాచ్ల్లో 779 పరుగులు చేసి తాను సారథ్యం వహిస్తున్న విదర్భ జట్టును ఫైనల్కు చేర్చాడు.
దాంతో కరుణ్ నాయర్ను భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమైంది. కానీ సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. జట్టులో ఖాళీ లేదని, భవిష్యత్తులో ఏ ఆటగాడైన గాయపడితే అతనికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. తాజాగా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు సిద్దమైన శుభ్మన్ గిల్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కరణ్ నాయర్ సెలెక్షన్ గురించి ప్రశ్నించగా గిల్ వివరణ ఇచ్చాడు.

'విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడాడు. కానీ అతన్ని ఆడించాలంటే జట్టులో ఎవర్నీ తప్పించాలి? ప్రస్తుత టీమ్ కాంబినేషన్ అద్భుతంగా రాణిస్తోంది. వన్డే ప్రపంచకప్లో మిడిలార్డర్లోని ప్రతీ బ్యాటర్ 400-500 పరుగులు చేశారు. ఆ ప్రపంచకప్ తర్వాత మేం మూడు వన్డేలు మాత్రమే ఆడాం. ఎవరూ పెద్దగా రాణించలేదు. మేం వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓడాం.ఈ నాలుగు మ్యాచ్లు మినహా మా ప్రదర్శన అద్భుతంగా ఉంది. జట్టు మొత్తం నిలకడగా రాణిస్తోంది.
దేశవాళీ క్రికెట్ రాణించిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కకపోవడం దురదృష్టకరం. అయితే ఏ ఆటగాడికైనా అవకాశం దక్కాలంటే ముందుగా అతనికి జట్టులో చోటు ఉండాలి. ఇప్పటికే జట్టులో రాణిస్తున్న ఆటగాడిని పక్కనపెట్టి తీసుకోవాలనడం అన్యాయం. అలా చేస్తే స్థిరమైన జట్టును సిద్దం చేయలేం. ప్రతీ జట్టు తమ ఆటగాళ్లకు అండగా ఉంటుంది. ఆటగాళ్లు అభద్రతా భావానికి గురికాకుడదని మేం కోరుకుంటున్నాం.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
కరుణ్ నాయర్ భారత జట్టు తరఫున చివరిసారిగా 2017లో ఆడాడు. టెస్ట్ల్లో భారత్ తరఫున 6 మ్యాచ్లు ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత అతనికి అవకాశాలు రాలేదు.