ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్తో గొడవ సందర్భంగా జరిగిన సంభాషణను సీక్రెట్గా ఉంచడం తామిద్దరికి శ్రేయస్కరమని టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ తెలిపాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో అండర్సన్-గిల్ మధ్య మైదానంలో వాగ్వాదం చోటు చేసుకుంది.
రెండో రోజు బ్యాటింగ్ సందర్భంగా శుభ్మన్ గిల్ ఆడిన షాట్స్కు అండర్సన్ సహనం కోల్పోయాడు. ముఖ్యంగా క్రీజును వదిలి అండర్సన్ తల మీదుగా గిల్ కొట్టిన సిక్సర్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఈ షాట్ అనంతరం మరింత ఆగ్రహానికి గురైన అండర్సన్.. తన నోటికి పనిచెప్పాడు. అండర్సన్ విసిరిన సవాలైన బంతులను గిల్ గొప్పగా ఎదుర్కొన్నాడు.

ప్రతిదాడికి దిగుతూ బౌండరీలు సాధించాడు. చివరికి అతని బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య నెలకొన్న రసవత్తర పోరు విరాట్ కోహ్లీ-అండర్సన్ పోటీని గుర్తు చేసింది. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం అండర్సన్తో గొడవపై గిల్ను ప్రశ్నించగా.. ఈ వాగ్వాదం సందర్భంగా జరిగిన సంభాషణ ఏంటో చెప్పేందుకు గిల్ నిరాకరించాడు.
సీక్రెట్గా ఉంచుకోవడం ఇద్దరికి మంచిదని తెలిపాడు. అండర్సన్ తలపై నుంచి సిక్స్ కొట్టిన విధానాన్ని.. అతని బౌలింగ్లో ఔటైన బాల్ గురించి కూడా వివరించాడు.
తలపై నుంచి సిక్సర్..
'అండర్సన్ వేసిన ఆ బంతి గొప్పగా అనిపించలేదు. అప్పటికే స్టెప్ ఔటై అతని తల మీదుగా షాట్ ఆడాలని డిసైడ్ అయ్యాను. అండర్సన్ బౌలింగ్లో నేను క్లీన్ బౌల్డ్ అయిన బంతిని సరిగ్గా చూడలేదు. దాంతోనే బంతిని కనెక్ట్ చేయలేకపోయాను. కానీ ప్రతీసారి నేను సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేయాలని భావిస్తాను.
చేసిన పరుగులను భారీ స్కోర్గా మలిచేందుకు ప్రయత్నిస్తాను. అండర్సన్తో గొడవ సందర్భంగా మా మధ్య జరిగిన సంభాషణను సీక్రెట్గా ఉంచడం మా ఇద్దరికీ మంచిదని భావిస్తున్నాను. 'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
తన తండ్రి ఈ మ్యాచ్కు హాజరవ్వడంపై శుభ్మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఆడిన అంతర్జాతీయ టెస్ట్ను ప్రత్యక్షంగా చూడటం తన తండ్రికి ఇదే తొలిసారి అని చెప్పాడు. 'నేను ఓ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండగా మా నాన్న ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారి. నేను టెస్ట్ క్రికెట్ ఆడటం అతని కల. ఈ రోజు నా ప్రదర్శన పట్ల అతను గర్వపడుతాడని ఆశిస్తున్నా.'అని శుభ్మన్ గిల్ తెలిపాడు.

భారత్కు భారీ ఆధిక్యం..
ఈ మ్యాచ్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 120 ఓవర్లలో 8 వికెట్లకు 473 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 103), శుభ్మన్ గిల్(150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్లతో 110) సెంచరీలతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
క్రీజులో కుల్దీప్ యాదవ్(27 బ్యాటింగ్)తో పాటు జస్ప్రీత్ బుమ్రా(19 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(4/170) నాలుగు వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ రెండు వికెట్లు తీసాడు. జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్లకు తలో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేగారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (79)మినహా అంతా విఫలమయ్యారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 255 పరుగులకు చేరింది.