టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యం కారణంగానే గెలిచే మ్యాచ్లో ఓడామని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. ఒక్క 50 పరుగుల భాగస్వామ్యం నమోదైనా ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన మూడో టెస్ట్లో ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా విజయం కోసం రవీంద్ర జడేజా(181 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 61 నాటౌట్) చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్మన్ గిల్.. ఓడినా తమ పోరాటం పట్ల గర్వంగా ఉందని చెప్పాడు.'ఈ మ్యాచ్లో ఓడినా చాలా గర్వంగా ఉంది. ఐదు రోజుల పాటు ఆఖరి సెషన్ వరకు జరిగిన ఈ మ్యాచ్లో చివరి వరకు పోరాడం. మా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. ఈ లక్ష్యాన్ని సునాయసంగా చేధిస్తామని అనుకున్నా. మాకు బ్యాటింగ్ డెప్త్ ఉండటంతో ఈ మ్యాచ్లో గెలుస్తామనే నమ్మకం కలిగింది. కానీ ఇంగ్లండ్ మాపై ఎదురుదాడికి దిగింది. మా టాపార్డర్లో రెండు 50 ప్లస్ భాగస్వామ్యాలు వచ్చినా విజయానికి సరిపోతుందని భావించా. కానీ మా టాపార్డర్ బ్యాటర్లు అలా చేయలేకపోయారు.

మా లొయారార్డర్ మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. బ్యాటర్లు క్రీజులో ఉన్నంత సేపు గెలుపుపై ఆశ ఉంటుంది. ఎందుకంటే లక్ష్యం పెద్దది కాదు. 50-60 పరుగుల భాగస్వామ్యం నమోదైతే మ్యాచ్పై పట్టు సాధించవచ్చనే విషయం మాకు తెలుసు. జడేజా చాలా అనుభవం కలిగిన ఆటగాడు. అతనికి ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. టెయిలెండర్స్ సాయంతో వీలైనంత ఎక్కువ సేపు అతను బ్యాటింగ్ చేయాలనుకున్నాను. తొలి ఇన్నింగ్స్లో 80-100 పరుగుల ఆధిక్యం సాధిస్తే జట్టుకు కలిసొస్తుందని భావించాం. ఎందుకంటే ఈ వికెట్పై ఆఖరి రోజు 150-200 పరుగుల లక్ష్యాన్ని చేధించడం అంత సులువైన పని కాదని మాకు తెలుసు. అందుకే 80 పరుగుల ఆధిక్యం అందుకోవాలనుకున్నాం. కానీ అలా జరగలేదు.
నాలుగో రోజు ఆట చివర్లో మేం కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ముఖ్యంగా ఆఖరి రెండు వికెట్లు మాకు నష్టం చేశాయి. ఈ రోజు ఉదయం కూడా ఇంగ్లండ్ సరైన ప్రణాళికతో బౌలింగ్ చేసింది. మేం ఒక 50 పరుగుల భాగస్వామ్యాన్ని ఆశించాం. మా టాపార్డర్లో ఒక 50 ప్లస్ పార్ట్నర్షిప్ వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కొన్నిసార్లు స్కోర్ కార్డ్తో ఎంత బాగా ఆడారనే విషయం ప్రతిబింబించదు. ఈ మ్యాచ్లో మేం గెలవకపోయినా మంచి క్రికెట్ ఆడాం. ఈ సిరీస్ మరింత ఉత్సాహంగా ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా తదుపరి మ్యాచ్ ఆడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.