
ముంబై: తనపై వస్తున్న రూమర్లకు టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ చెక్ పెట్టాడు. తానింకా ఒంటరినేనని.. ఇప్పట్లో ఎవరితోనూ ప్రేమలో పడే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో ఈ యువ బ్యాట్స్మన్ ప్రేమాయణం సాగిస్తున్నాడనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా వారు పెట్టి కొన్ని పోస్ట్లు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన శుభ్మన్ గిల్.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. 'మీరింకా ఒంటరిగానే ఉన్నారా? అని సదరు అభిమాని ప్రశ్నించగా... 'అవును నేనింకా ఒంటరిగానే ఉన్నా. ఇప్పట్లో ఎవరితోనూ కలిసే ఆలోచనలు లేవు' అని తనపై వచ్చే పుకార్లకు తెరదించాడు. అయితే, ఇలా రిప్లై ఇచ్చిన కామెంట్ను అతను తర్వాత తొలగించడం గమనార్హం. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన కోసం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్న శుభ్మన్ గిల్.. ఇన్స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చాడు.
ఈ చిట్చాట్లో సహచర ఆటగాళ్లు, అతని స్నేహితులు కూడా శుభ్మన్ సరదా ప్రశ్నలతో విసిగించారు. ఫస్ట్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపిన శుభ్మన్.. క్రికెట్ తర్వాత బాస్కెట్ బాల్, సాకర్ అంటే ఇష్టమని తెలిపాడు.
గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో శుభ్మన్గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 91 పరుగుల కీలక ఇన్నింగ్స్తో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలా చారిత్రాత్మక సిరీస్ విజయంలో భాగమైన గిల్ ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లోనూ పాల్గొన్నాడు. అయితే ఆ సిరీస్లో గిల్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఐపీఎల్ 2021 సీజన్లోనూ విఫలమయ్యాడు. అయినా గిల్ ఆటపై నమ్మకముంచిన బీసీసీఐ కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు ఎంపిక చేసింది. మయాంక్ అగర్వాల్తో పోటీ ఉన్నా.. రోహిత్ శర్మకు జతగా గిల్ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక జూన్ 18-22వరకు ఛాంపియన్షిప్ ఫైనల్, ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14వరకు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరగనుంది.