సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డేలో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. ఇది పర్ఫెక్ట్ గేమ్ అని, కెప్టెన్గా ఈ విజయం తనకు ప్రత్యేకమైనదని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) అజేయ అర్థశతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్తో టీమిండియా చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్మన్ గిల్.. సంతోషం వ్యక్తం చేశాడు. రోహిత్, కోహ్లీ బ్యాటింగ్ అద్బుతమని, బౌలింగ్లో హర్షిత్ రాణా స్పిన్నర్లు రాణించారని కొనియాడాడు. 'మాకు ఇది పర్ఫెక్ట్ గేమ్. మిడిల్ ఓవర్లలోనే మ్యాచ్పై పట్టు బిగించాం. ఛేజింగ్ చూడముచ్చటగా అనిపించింది. మా స్పిన్నర్లు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. పేసర్లు కీలక వికెట్లు తీసారు. మిడిల్ ఓవర్లలో హర్షిత్ రాణా వేగంగా బౌలింగ్ చేశాడు. ఇలాంటి క్వాలిటీ బౌలింగ్ మాకు అవసరం. రోహిత్, కోహ్లీ చాలా ఏళ్లుగా ఇలాంటి విజయాలు అందించారు. వారి ఆటను చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేకమైన మైదానంలో ఈ విజయం దక్కడం గొప్ప విషయం'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మాథ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్(24) మరోసారి విఫలమవ్వగా.. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.