టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయంపై వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక అప్డేట్ ఇచ్చాడు. కోహ్లీ గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతను ఫిట్గానే ఉన్నాడని తెలిపాడు. కటక్ వేదికగా ఆదివారం జరిగే రెండో వన్డేలో కోహ్లీ ఆడుతాడని చెప్పాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో గురువారం నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
కుడి మోకాలి నొప్పితో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడని విషయం తెలిసిందే. గత రాత్రి కోహ్లీకి మోకాలి నొప్పి మొదలైందని, ముందస్తు చర్యల్లో భాగంగా అతను ఆడటం లేదని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ తెలిపాడు.

డోంట్ వర్రీ..కోహ్లీ ఫైన్!
దాంతో కోహ్లీ గాయంపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా.. మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ క్లారిటీ ఇచ్చాడు. 'ఉదయం లేవగానే కోహ్లీ మోకాలు వాచింది. బుధవారం ప్రాక్టీస్ సెషన్ వరకు కోహ్లీ బాగానే ఉన్నాడు. ఈ గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి మ్యాచ్ వరకు కోహ్లీ ఫిట్ అవుతాడు.'అని శుభ్మన్ గిల్ తెలిపాడు.
కోహ్లీ గైర్హాజరీలో నెంబర్-3లో బ్యాటింగ్ చేసిన శుభ్మన్ గిల్ అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన బ్యాటింగ్ అడ్జస్ట్మెంట్పై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టెస్ట్ల్లో నేను నెంబర్-3లోనే ఆడుతాను. కాబట్టి ఈ ప్లేస్ అడ్జస్ట్ అవ్వడం నాకేమి ఇబ్బంది అనిపించలేదు. కానీ విభిన్నమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పుడు నెంబర్ 3 బ్యాటర్ పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. అదే ఓపెనర్లు శుభారంభం అందిస్తే అదే జోరును కొనసాగించాలి. ఈ ఆలోచన విధానంతోనే పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాను. మంచి షాట్స్ ఆడటంపైనే ఫోకస్ పెట్టాను.
కెప్టెన్సీ నేర్చుకుంటున్నా..
శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కూడా నాకు ఎంతో ఉపయోగపడింది. అతని దూకుడుతో ఇంగ్లండ్ వెనుకడుగేసింది. ఈ మ్యాచ్లో 70 పరుగుల వద్ద నేను కొట్టిన పుల్ షాట్ నా ఫేవరేట్. పిచ్ కాస్త డబుల్ పేస్గా ఉంది. స్పిన్నర్లు నెమ్మదిగా వేస్తే బంతి టర్న్ అవుతోంది. అందుకే స్క్వేర్ ఆఫ్ వికెట్ దిశగా షాట్స్ ఆడాను. వైస్ కెప్టెన్సీతో నా బ్యాటింగ్పై ఎలాంటి ప్రభావం లేదు. కానీ మైదానంలో రోహిత్ శర్మ ఏం చేస్తున్నాడనే విషయాలను తెలుసుకుంటున్నాను. నా వంతు సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సంకోచించకుండా చెప్పాలని రోహిత్ భాయ్ అన్నాడు.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.