అందుకే సర్ఫరాజ్ ఖాన్, సరాన్ష్ జైన్ను ఆడించడం లేదు: శుభ్మన్ గిల్
రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. గత మ్యాచ్ కాంబినేషన్నే కొనసాగించాలనుకున్నామని, దాంతోనే సర్ఫరాజ్ ఖాన్, సరాన్ష్ జైన్లకు తుది జట్టులో అవకాశం దక్కలేదని గిల్ వివరణ ఇచ్చాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. వాతావరణం కూడా మ్యాచ్కు అనుకూలంగా ఉంది. కాబట్టి ఇది మాకు మంచి రోజు అవుతుందని ఆశిస్తున్నాం. గత మ్యాచ్లో ఆడిన కాంబినేషన్తోనే బరిలోకి దిగుతున్నాం. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో మొత్తం ఐదుగురు బౌలర్లు ఉన్నారు. దేశానికి సారథ్యం వహించే అవకాశం రావడం చాలా గౌరవంగా భావిస్తాను. ముఖ్యంగా మన స్వాతంత్ర్య దినోత్సవం నాడే 600వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.'అని శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నామని శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా పేర్కొన్నాడు. 'ఈ పిచ్ బాగుంది. మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఈ వికెట్ చాలా పొడిగా కూడా ఉంది. పాతుమ్ నిస్సంక స్థానంలో నిషాన్ మదుష్క జట్టులోకి వచ్చాడు. నిరోషన్ డిక్వెల్లా కీపింగ్ చేస్తాడు. అలాగే కేశర అరంగేట్రం చేస్తున్నాడు. నాతో సహా సోనాల్ దినూష కలుపుకొని ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఆల్రౌండర్లు బరిలోకి దిగుతున్నారు. గాలే వేదికగా 50వ టెస్ట్ మ్యాచ్ కావడం, చాలా గొప్ప విషయం. ఇది ఒక ఐకానిక్ మైదానం. ఈ ప్రత్యేకమైన మ్యాచ్ ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది.'అని ధనంజయ డిసిల్వా పేర్కొన్నాడు.
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్దత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ
శ్రీలంక: లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండీమల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమార, అసింత ఫెర్నాండో.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

