న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామని టాస్ సందర్భంగా గిల్ చెప్పుకొచ్చాడు. ఈ కాంబినేషన్లో భాగంగానే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదని స్పష్టం చేశాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. విభిన్న కాంబినేషన్లను ప్రయత్నిస్తాం. మాకు సెట్ అయ్యే కాంబినేషన్ ఏదో పరీక్షిస్తాం. మంచు కురుస్తున్నప్పుడు బౌలింగ్ చేయడం సవాల్తో కూడుకున్న పని. డ్యూ మధ్య ఫ్లడ్ లైట్స్ కింద బ్యాటింగ్ చేయడం సులువు. జట్టులోని ఆటగాళ్లంతా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడి సూపర్ ఫామ్లో కనిపిస్తున్నారు. జట్టు వాతావరణం బాగుంది. మేం ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నాం. సుందర్, జడేజా, కుల్దీప్ స్పిన్నర్లుగా ఆడుతుండగా.. సిరాజ్, ప్రసిధ్, హర్షిత్ రాణా పేసర్లుగా ఆడుతున్నారు. ఈ కాంబినేషన్లో భాగంగానే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు.'అని గిల్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ముందుగా బ్యాటింగ్ చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడి వాతావరణానికి మేం అలవాటు పడ్డాం. ఇక్కడ కొన్ని గొప్ప నెట్ సెషన్లలో పాల్గొన్నాం. ఇది మాకు చాలా పెద్ద సిరీస్. న్యూజిలాండ్ తరఫున ఆడటం మాకు ఎప్పుడూ గర్వకారణం.
మేం భారత్లోనే ప్రపంచకప్ ఆడబోతున్నాం. మెగా టోర్నీకి ముందు ఈ సిరీస్ మాకు అడ్వాంటేజ్గా మారనుంది. జట్టులో కొత్త ఆటగాళ్లు ఉన్నారు. కొంత అనుభవం కూడా ఉంది. నేను లోయరార్డర్లో బ్యాటింగ్ చేస్తాను. ఈ మ్యాచ్తో క్రిస్టియన్ క్లార్క్ అరంగేట్రం చేస్తున్నాడు.భారత సంతతికి చెందిన ఆదిత్య అశోక్ మా ప్రధాన స్పిన్నర్.'అని మైఖేల్ బ్రేస్ వెల్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), జకారి ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, ఆదిత్య అశోక్.
భారత్ : రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.