టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో 54 ఏళ్ల రికార్డ్ను శుభ్మన్ గిల్ బద్దలు కొట్టాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో బ్యాట్తో దుమ్మురేపుతున్న గిల్.. మరోవైపు రికార్డుల మోత మోగిస్తున్నాడు.
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ(269) బాదిన గిల్.. రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 129 బంతుల్లోనే సెంచరీ సాధించిన గిల్.. అరుదైన రికార్డ్స్ను తన పేరిట లిఖించుకున్నాడు. 54 ఏళ్ల తర్వాత ఓ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో పాటు సెంచరీ బాదిన తొలి భారత బ్యాటర్గా శుభ్మన్ గిల్ నిలిచాడు. 1971లో సునీల్ గవాస్కర్.. వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో పాటు సెంచరీ సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు గిల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఆ మ్యాచ్లో సునీల్ గవాస్కర్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 344 పరుగులు చేస్తే.. శుభ్మన్ గిల్ ఇప్పటికే 350 రన్స్ పూర్తి చేసుకున్నాడు.

రన్స్ | బ్యాటర్ | ప్రత్యర్థి& ఏడాది |
| 350* | శుభ్మన్ గిల్ | vs ఇంగ్లండ్, 2025 |
| 344 | సునీల్ గవాస్కర్ | vs వెస్టిండీస్, 1971 |
| 340 | వీవీఎస్ లక్ష్మణ్ | vs ఆస్ట్రేలియా, 2001 |
| 330 | సౌరవ్ గంగూలీ | vs పాకిస్థాన్, 2007 |
| 319 | వీరేంద్ర సెహ్వాగ్ | vs సౌతాఫ్రికా, 2008 |
భారత కెప్టెన్గా అరంగేట్ర సిరీస్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానూ శుభ్మన్ గిల్ నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ను అధిగమించాడు. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. ఆ సిరీస్లో 449 పరుగులు చేశాడు. తాజా సిరీస్లో శుభ్మన్ గిల్ నాలుగు ఇన్నింగ్స్లోనే 500 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఓ టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్గా కూడా శుభ్మన్ గిల్ నిలిచాడు. ఇప్పటికే అతను రెండో టెస్ట్లో 350 ప్లస్ రన్స్ చేశాడు.
ఈ రికార్డ్ కూడా విరాట్ కోహ్లీ పేరిట ఉండగా.. గిల్ అధిగమించాడు. 2017లో శ్రీలంకతో టెస్ట్లో కోహ్లీ 293 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్గా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్(542), విరాట్ కోహ్లీ(593), రాహుల్ ద్రవిడ్(602) శుభ్మన్ గిల్ కంటే ముందున్నారు. ఐదు టెస్ట్ల సిరీస్ ముగిసేలోపు ఈ రికార్డ్ను గిల్ అధిగమించనున్నాడు.