కీలక క్యాచ్లు వదిలేయడంతో పాటు లోయరార్డర్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా మంగళవారం ముగిసిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్మన్ గిల్ తమ ఓటమికి గల కారణాలను తెలిపాడు. ఇంగ్లండ్ ముందు 430 పరుగుల లక్ష్యాన్ని ఉంచాలనుకున్నామని, కానీ 25 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్లు కోల్పోయామని చెప్పాడు. ఈ తప్పిదాల నుంచి గుణ పాఠం నేర్చుకొని తదుపరి మ్యాచ్కు సిద్దమవుతామని తెలిపాడు.
'ఇదో అద్భుతమైన టెస్ట్ మ్యాచ్. మాకు విజయవకాశాలు లభించాయి. కానీ కీలక క్యాచ్లను వదిలేయడం.. లోయరార్డర్ బ్యాటర్ల వైఫల్యం మా ఓటమిని శాసించింది. నిన్న(నాలుగో రోజు ఆట) ఇంగ్లండ్ ముందు 430 పరుగుల లక్ష్యాన్ని పెట్టాలనుకున్నాం. కానీ 25 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్లు కోల్పోయాం. ఈ రోజు(ఆఖరి రోజు) కూడా తొలి వికెట్ తీసిన తర్వాత మాకు విజయవకాశాలు ఉన్నాయని భావించాను. కానీ మేం ఆశించిన రీతిలో ఆట సాగలేదు. తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలడం గురించి మేం చర్చించుకున్నాం. కొన్ని సార్లు ఇలా జరుగుతుంది. ముందు ముందు ఈ తప్పిదాలను సరిదిద్దుకుంటాం.

ఇలాంటి వికెట్లపై అవకాశాలు సునాయసంగా రావు. కానీ మాది యువ జట్టు. నేర్చుకుంటున్నాం. ఈ విషయంలో మేం మరింత మెరుగవ్వాలి. తొలి సెషన్లో మేం మెరుగ్గానే బౌలింగ్ చేశాం. వికెట్లు తీయకపోయినా పరుగులు ఇవ్వలేదు. కానీ బంతి పాత బడిన తర్వాత పరుగులు ఆపడం చాలా కష్టం. బంతి సాఫ్ట్గా ఉన్నప్పుడే వికెట్లు తీయాలి. జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అవకాశాలను సృష్టించాడు. రిషభ్ పంత్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బుమ్రా ఏ మ్యాచ్లు ఆడుతాడనేది మ్యాచ్ను బట్టి నిర్ణయిస్తాం. తదుపరి మ్యాచ్కు సుదీర్ఘ విరామం ఉంది. ఆ మ్యాచ్ సమయానికి బుమ్రా విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాం.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
371 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 21/0 ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. బెన్ డకెట్(170 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్తో 149) సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(126 బంతుల్లో 7 ఫోర్లతో 65), జోరూట్(84 బంతుల్లో 6 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ ఇద్దరూ తొలి వికెట్కు 188 పరుగులు జోడించి భారత పతనాన్ని శాసించారు.భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 364 పరుగులు చేసింది.