IND vs AFG: శతక్కొట్టిన శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్.. అఫ్గాన్ ముందు భారీ లక్ష్యం
మూడు వన్డేల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో రెండో వన్డేలో టీమిండియా 403 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.కెప్టెన్ శుభ్మన్ గిల్(110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154), ఇషాన్ కిషన్(79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 125) సెంచరీలతో కదం తొక్కడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది.
రోహిత్ శర్మ(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అఫ్గాన్ బౌలర్లలో ఖరోటే(4/76) నాలుగు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్(3/48) మూడు వికెట్లు పడగొట్టాడు. అల్లా ఘజన్ఫర్, మహమ్మద్ సలీమ్ చెరో వికెట్ తీసారు. 42 ఓవర్లలోనే 360 పరుగులు చేసి రికార్డ్ స్కోర్ దిశగా సాగిన భారత్.. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. 42 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లను చేజార్చుకుంది.

సఫారీ రికార్డ్ సమం..
ఈ భారీ స్కోర్తో సౌతాఫ్రికా రికార్డ్ను టీమిండియా సమం చేసింది. వన్డేల్లో సౌతాఫ్రికా 8సార్లు 400+ స్కోర్లు చేయగా.. తాజాగా టీమిండియా కూడా 8వ 400+ స్కోర్తో ఆ రికార్డ్ను సమం చేసింది. ఈ జాబితాలో ఇంగ్లండ్(7సార్లు), ఆస్ట్రేలియా(3 సార్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
యశస్వి విఫలమైనా..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్(4) తీవ్రంగా నిరాశపర్చాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. తమదైన శైలిలో బ్యాటింగ్ చేసిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది.
అయితే హాఫ్ సెంచరీ ముంగిట రోహిత్ శర్మ(48)ను రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి ఇషాన్ కిషన్ రాగా.. శుభ్మన్ గిల్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఇషాన్ కిషన్.. హాఫ్ సెంచరీ అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరూ ఒకే ఓవర్లో బౌండరీలతో సెంచరీ మార్క్ అందుకున్నారు.
శతక్కొట్టిన గిల్, ఇషాన్..
77 బంతుల్లో శుభ్మన్ గిల్ 9వ వన్డే శతకాన్ని అందుకోగా.. 71 బంతుల్లో ఇషాన్ కిషన్ రెండో వన్డే సెంచరీ సాధించాడు. సెంచరీ అనంతరం ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 224 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ రాగా..108 బంతుల్లో శుభ్మన్ గిల్ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు.
గిల్ వికెట్తో.. భారత్ వికెట్ల పతనం మొదలైంది. ఖరోటే వరుస బంతుల్లో గిల్, రాహుల్(0)ను పెవిలియన్ చేర్చాడు. అయ్యర్ను కూడా అతనే ఔట్ చేయగా.. గుర్నూర్ బ్రార్(3), వాషింగ్టన్ సుందర్లను రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. అర్ష్దీప్ సింగ్(3)ను గజన్ఫర్ ఔట్ చేయగా.. ప్రిన్స్ యాదవ్ రనౌట్గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

