మెడ నొప్పితో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. దాంతో అతన్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో శుభ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నొప్పి తీవ్రంగా మారడంతో శుభ్మన్ గిల్ను స్ట్రెచర్ సాయంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కోల్కతా మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
వాస్తవానికి మ్యాచ్ తొలి రోజు ఆట రాత్రే శుభ్మన్ గిల్కు మెడ కండరాలు పట్టేసాయి. కానీ పెయిన్ కిల్లర్స్ సాయంతో అతను బ్యాటింగ్కు దిగాడు. మూడు బంతులు ఆడి ఓ బౌండరీ కూడా కొట్టాడు. ఈ బౌండరీ కొట్టే క్రమంలో అతని మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి తీవ్రమైంది. దాంతో గిల్ మైదానం వీడాడు. మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. సాయంత్రానికి నొప్పి తీవ్ర కావడంతో కోల్కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మెడకు సర్వైకల్ కాలర్తో స్ట్రెచర్పై తీసుకెళ్లడంతో గిల్కు తీవ్ర గాయమైందనే ఆందోళన వ్యక్తమవుతుంది.

అయితే గిల్ గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే సర్వైకల్ కాలర్ పెట్టామని, అబ్జర్వేషన్ కోసమే ఐసీయూలో ఉంచామని జట్టు వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. శుభ్మన్ గిల్ గాయంపై బీసీసీఐ ఇప్పటికే స్పందించింది. మెడ పట్టేయడంతో ఆసుపత్రికి తరలించామని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తుందని తెలిపింది. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నాడని, తొలి టెస్ట్ మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడని పేర్కొంది.
ఇక నిద్రలేమి కారణంగానే శుభ్మన్ గిల్కు మెడ కండరాలు పట్టేసాయని, త్వరలోనే కోలుకుంటాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపాడు. ఈ గాయం నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్తో పాటు రెండో టెస్ట్కు కూడా గిల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. బ్యాటింగ్లో తడబడినా బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో టీమిండియా పైచేయి సాధించింది. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ టెంబా బవుమా(29 బ్యాటింగ్)తో పాటు టెయిలెండర్ కోర్బిన్ బోష్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 37/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 189 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.