ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో అనామక క్రికెటర్ శుభమ్ దూబే పంట పండింది. నాగ్పూర్కు చెందిన ఈ ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ రూ. 5.8 కోట్లు కొనుగోలు చేసింది. గ్లవ్స్ కూడా కొనలేని స్థాయి నుంచి ఐపీఎల్లోకి దూసుకొచ్చిన 29 ఏళ్ల శుభమ్ దూబే జీవిత ప్రయాణం అందరికీ స్పూర్తి దాయకం.
నాగ్పూర్కు చెందిన శుభమ్.. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రీ బద్రీప్రసాద్ దూబె పాన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి సాయంగా శుభమ్ దూబే సైతం పాన్ షాప్ను నడిపించేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి క్రికెట్ అంటే చాలా కష్టం. భారత జట్టుకు ఆడాలని కలలు కనేవాడు. అయితే తన ఆర్థిక పరిస్థితి అందుకుసరిపోదని బాధపడేవాడు.

విదర్భ మాజీ ప్లేయర్ సుదీప్ జైస్వాల్ పరిచయం కావడం దూబె కెరీర్ను మలుపు తిప్పింది. శుభ్మన్ను ఎంతో ప్రోత్సహించిన సుదీప్.. అతని పరిస్థితిని చూసి కిట్ అందించాడు. కెరీర్ ఆరంభంలో ఆర్థిక సాయం చేసి అండగా నిలిచాడు. దాంతో విదర్భ అండర్ 19, అండర్ 23 జట్లలో చోటు దక్కించుకున్న శుభమ్.. అసాధారణ ప్రదర్శనతో సీనియర్ జట్టులో అవకాశాన్ని అందుకున్నాడు.
విదర్భ సీనియర్ జట్టు తరఫున రాణించినా.. అతనికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. వయసు కూడా 29 ఏళ్లకు చేరడంతో అవకాశాలు అందుకోవడం కష్టమని అంతా భావించారు.
కానీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. శుభమ్ దూబే లైఫ్ కూడా ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శుభమ్ దూబే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 7 మ్యాచ్ల్లో 222 పరుగులు చేశాడు. 180 స్ట్రైక్తో పరుగులు చేశాడు. దాంతో అతని పేరు దేశవాళీ క్రికెట్లో మరుమోగింది. ముఖ్యంగా బెంగాల్పై 20 బంతుల్లో 58 పరుగులు చేసిన అతని ఇన్నింగ్స్ తీవ్ర చర్చనీయాంశమైంది.
లోయరార్డ్లో వచ్చి పవర్ హిట్టింగ్తో పరుగుల వరద పారించడంతో ఫ్రాంచైజీలు అతనిపై ఫోకస్ పెట్టాయి. గువహాటి టీ20 లీగ్లోనూ అతను అదే జోరు కనిపించడంతో ఐపీఎల్ వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.
రూ. 20 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన అతన్ని రాజస్థాన్ ఏకంగా రూ. 5.8 కోట్లతో దూబెను దక్కించుకుంది. అమ్ముడుపోతే గొప్ప అనుకున్న దూబేకు ఇది పెద్ద జాక్ పాటే.
భారీ ధర పలకడంపై శుభమ్ దూబే సంతోషం వ్యక్తం చేశాడు. ఒకప్పుడు గ్లోవ్స్ కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని, సుదీప్ సార్ వల్లే ఈ స్థితిలో ఉన్నానని తెలిపాడు. వేలంలో ఇంత డబ్బులు వస్తాయని కూడా అనుకోలేదని, చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.