విరాట్ కోహ్లీ స్థానానికే ఎసరు పెట్టిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్లో రాణించకుంటే చోటు గల్లంతే!

హైదరాబాద్: తనదైన ఆటతో ఒకప్పుడు భారత క్రికెట్ను ఏలిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచకప్ ఘోర వైఫల్యం అనంతరం పరిస్థితులన్నీ అతనికి ప్రతికూలంగా మారాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తప్పించగా.. సౌతాఫ్రికా ఘోర ఓటమితో టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్నా.. బ్యాటింగ్లో మునపటిలా సత్తా చాటలేకపోతున్నాడు.

కోహ్లీలో ఆ ఫైర్ లేదు..
ఆడపాదడపా హాఫ్ సెంచరీలు బాదుతున్నా.. అవి అతని స్థాయికి తగినవిగా కనిపించడం లేదు. గత రెండేళ్లుగా సెంచరీ కోసం నిరీక్షిస్తున్నాడు. మునపటిలా వేగంగా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే అప్కమింగ్ టీ20 ప్రపంచకప్లో కోహ్లీ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. మునపటిలా సత్తా చాటితేనే జట్టులో చోటు కాపాడుకోగలడు. లేకుంటే నిర్దాక్షిణ్యంగా ఈ సీనియర్ క్రికెటర్ను టీమ్మేనేజ్మెంట్ తప్పించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సమీప భవిష్యత్తులో టీ20 టోర్నీలు లేనప్పటికి మార్చి 26 నుంచి జరిగే ఐపీఎల్.. అతని కెరీర్కు కీలకం కానుంది.

సూర్య, శ్రేయస్ నుంచి తీవ్ర పోటీ..
ఇంతకుముందు వరకు టీమిండియాలో నంబర్ 3 ఆటగాడంటే విరాట్ కోహ్లీనే. కానీ ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఆ స్థానాన్ని కైవసం చేసుకునేలా కనిపిస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా బ్యాట్తో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కోహ్లీ కన్నా దూకుడైన ఆట తీరుతో అదరగొడుతున్నారు. గతేడాది శ్రేయస్ అయ్యర్ గాయపడటం వల్ల అవకాశం దక్కించుకున్న సూర్యకుమార్ తనదైనశైలిలో మెరుపులు మెరిపించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

కోహ్లీ స్థానానికే ఎసరు..
ఇక శ్రేయస్ సైతం ఇటీవల దంచికొట్టుడే పనిగా పెట్టుకున్నాడు. తాజాగా శ్రీలంకతో ఆడిన టీ20 సిరీసే అందుకు నిదర్శనం. మూడు మ్యాచ్ల్లోనూ కోహ్లీ స్థానంలో బరిలోకి దిగిన అతడు మూడింట్లోనూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్సులు ఆడాడు. ఈ టీ20 సిరీస్కు చివరి నిమిషంలో సూర్య కుమార్ దూరమవ్వగా.. విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దాంతో శ్రేయస్ అయ్యర్ (57, 74, 73) ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చి దుమ్మురేపాడు. అజేయ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో మొత్తం 174 స్ట్రైక్ రేటుతో 204 పరుగులు చేసిన శ్రేయస్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు' గెలుచుకున్నాడు. అప్కమింగ్ ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి.. విరాట్ కోహ్లీ విఫలమైతే ఈ ఇద్దరికే తుది జట్టులో చోటు దక్కవచ్చు.

యువ ఆటగాళ్లకే ప్రాధాన్యం..
ఇక శ్రేయస్ అయ్యర్ సైతం తనకు నంబర్ 3లో ఆడటం చాలా ఇష్టమని తాజాగా వెల్లడించాడు. తన మాటలు, ఆటతో కోహ్లీ స్థానానికే ఎసరు పెట్టాడు. టీమిండియా మేనేజ్మెంట్ సైతం యువ ఆటగాళ్లకే అవకాశాలివ్వాలని భావిస్తోంది. వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్ల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఎన్నిప్రయోగాలు చేసినా.. గతంలో మాదిరి ఐపీఎల్ పెర్ఫామెన్స్ను పరిగణలోకి తీసుకొని వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేస్తారు. ఈ రెండు సిరీస్ల్లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్లు ఐపీఎల్లో సత్తా చాటితే వరల్డ్ కప్ టీమ్లో చోటు దక్కడం ఖాయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications