ఆస్ట్రేలియా పర్యటనలో ప్రాణాంతక గాయానికి గురైన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలి సారి స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా తన గాయానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం తాను కోలుకునే ప్రక్రియలో ఉన్నానని, రోజు రోజుకి చాలా మెరుగవుతున్నానని తెలిపాడు. ఈ కష్ట సమయంలో తన మంచిని కోరుతూ అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ను షేర్ చేశాడు.
'ప్రస్తుతం నేను గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో ఉన్నాను. వేగంగా కోలుకుంటున్నాను. ఈ సమయంలో నా మంచి కోరుతూ అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమకు రుణపడి ఉంటాను.'అని ఆ పోస్ట్లో పేర్కొన్నాడు.

మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ను వెనక్కి పరుగెత్తుతూ అందుకునే క్రమంలో అయ్యర్ కిందపడిపోయాడు. దాంతో అతని పక్కటెముకల్లో ఉండే సున్నితమైన ప్లీహానికి గాయమైంది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించింది. టెస్ట్ల్లో అంతర్గత రక్త స్రావం అవుతుందని గ్రహించిన వైద్యులు.. ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. రక్త స్రావం ఆగిపోవడంతో జనరల్ వార్డ్లోని ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు.
టీమిండియా ఫిజియోల వేగవంతమైన చికిత్స కారణంగా శ్రేయస్ అయ్యర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని బీసీసీఐ చీఫ్ డాక్టర్ మీడియాకు తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నాడని కూడా చెప్పాడు. అయితే ప్లీహం సున్నితమైన గాయం కావడంతో అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు మూడు నెలల సమయం పడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన అతను ఐపీఎల్ 2026 సీజన్తో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు శ్రేయస్ అయ్యర్.. ఆసుపత్రిలోని నర్సులతో జోకులు వేస్తూ సరదగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి.