టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షాపై సహచర ఆటగాడు, ముంబై సారథి శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్ అని కొనియాడిన శ్రేయస్ అయ్యర్.. లాలించి ఆడించడానికి అతనేమి చిన్న పిల్లాడు కాదని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో పృథ్వీ షా అన్ సోల్డ్గా నిలిచిన విషయం తెలిసిందే.
రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి అందుబాటులోకి వచ్చిన పృథ్వీ షాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఫిట్నెస్ లేకపోవడం.. ఆటపై ఫోకస్ తగ్గించడంతో పాటు క్రమశిక్షణారాహిత్యంతో ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్ల రికార్డ్ ధర పలికాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి సారథ్యం వహించిన శ్రేయస్ అయ్యర్.. జట్టును విజేతగా నిలబెట్టాడు. ఈ జట్టులో పృథ్వీ షా కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో పృథ్వీ షా కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలోనే పృథ్వీ షా కెరీర్ గురించి శ్రేయస్ అయ్యర్ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'పృథ్వీ షా నాకు మంచి ఫ్రెండ్. అతను గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్. పృథ్వీ షా నైపుణ్యాలు చాలా సహజంగా ఉంటాయి. కానీ ఆటపై ఫోకస్ పెట్టడం కీలకం. అతను దానిని మెరుగుపరుచుకోవాలి. అవకాశాలకు కొదవలేదు. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త టెక్నిక్స్ను అందిపుచ్చుకోవాలి. ఆట పట్ల అంకిత భావంతో ఉండాలి. పృథ్వీ షాకు ఏమైనా సలహా ఇచ్చారా? అని అడగవచ్చు. కానీ.. నేను ఎలాంటి సలహా ఇవ్వలేదు.
ఎందుకంటే పృథ్వీ షా కుర్రాడు కాదు. ఎంతో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. సలహాలు చాలా మంది ఇస్తారు. కానీ వాటిని బేరీజు వేసుకొని అనుసరించాల్సింది పృథ్వీ షానే. అతనేం పిల్లాడు కాదు. లాలించి ఆడించడానికి. ప్రోఫెషనల్ ప్లేయర్లకు ఏం చేస్తున్నాం.. ఏం చేయాలనేదానిపై కచ్చితమైన అవగాహన ఉండాలి. తప్పనిసరిగా తెలుసుకోవాలి. పృథ్వీ షా ఇలాంటి పరిస్థితులను ఇప్పటికే చాలా సార్లు ఎదుర్కొన్నాడు. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాలి.'అని శ్రేయస్ అయ్యర్ సూచించాడు.