కెరీర్ ప్రారంభంలో ఓ ఐపీఎల్ మ్యాచ్కు హాజరైన అమ్మాయిపై తాను మనసుపడ్డానని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన తాను హాయ్ కూడా చెప్పానని, సోషల్ మీడియా వేదికగా తనకు మెసేజ్ చేస్తుందేమోనని చాలా ఎదురు చూశానని చెప్పాడు.
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసే పాపులర్ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్'షోకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శ్రేయస్ అయ్యర్ హాజరయ్యాడు. ఈ షోలో రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్.. అభిమానులకు తెలియని చాలా విషయాలను పంచుకున్నారు.

కపిల్ శర్మ అడిగిన ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలిస్తూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగిన ఈ షో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతోంది. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ తన ఫస్ట్ క్రష్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
ఓ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ స్టేడియానికి వచ్చిన ఓ లేడీ ఫ్యాన్ 'అయ్యర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?'అనే ప్లకార్డ్ ప్రదర్శించడాన్ని కపిల్ శర్మ ప్రస్తావించగా.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నా తొలి ఐపీఎల్ సీజన్లో ఓ అందమైన అమ్మాయిని ప్రేక్షకుల స్టాండ్స్లో చూశాను. ఆ అమ్మాయివైపు చేయి చూపుతూ హలో కూడా చెప్పాను. ఆ సమయంలో ఫేస్బుక్ చాలా పాపులర్.
ఎఫ్బీ వేదికగా ఆమె మెసేజ్ చేస్తుందేమోనని చాలా ఎదురు చూశాను. కానీ ఆ అమ్మాయి నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదు.'అని తాను తొలిసారి మనసుపడ్డ అమ్మాయి గురించి శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
అయ్యర్ వ్యాఖ్యలతో షోకు హాజరైన వారంతా గట్టిగా అరుస్తూ నవ్వులు పూయించారు. తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మ అని చెప్పిన శ్రేయస్ అయ్యర్.. అతను టీమిండియా కెప్టెన్ అని ఈ మాట చెప్పడం లేదన్నాడు. సహచర ఆటగాళ్లతో రోహిత్ శర్మ చాలా నాటుగా మాట్లాడుతాడని తెలిపాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ సారథిగా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్.. జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించిన కేకేఆర్.. చెన్నైతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది.