
ముంబై: సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి అద్భుత బ్యాటింగ్తో తమ విజయవకాశాలను దెబ్బతీసాడని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఇది సన్రైజర్స్కు హ్యాట్రిక్ విజయం కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యామని చెప్పాడు.
ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి సూపర్ బ్యాటింగ్తో తమను కోలుకోనివ్వలేదని చెప్పాడు. బ్యాటింగ్లో రాణించి పోరాడే లక్ష్యాన్ని ఉంచినా.. దురదృష్టవశాత్తు బౌలర్లు విఫలమయ్యారని చెప్పాడు. సన్రైజర్స్ బౌలర్లు మాత్రం స్వింగ్ బౌలింగ్తో దుమ్మురేపారని కొనియాడాడు.
'ఈ ఓటమి చాలా నిరాశకు గురిచేసింది. నా అభిప్రాయం ప్రకారం మేం విధించిన లక్ష్యం పోరాడగలిగిందే. కానీ రాహుల్ త్రిపాఠి సూపర్ బ్యాటింగ్తో మూమెంటమ్ను మార్చేసాడు. మమ్మల్ని కోలుకోనివ్వలేదు. సన్రైజర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. బంతిని స్వింగ్ చేస్తూ ఇబ్బంది పెట్టారు. బ్యాటింగ్ విభాగంలో రాణించినా..దురదృష్టవశాత్తు బౌలింగ్లో విఫలమయ్యాం. ఈ రోజు మా బౌలర్లకు ఏదీ కలిసి రాలేదు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 54), ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 49 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, నటరాజన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది.
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రాహుల్ త్రిపాఠి (37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 71) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగగా, మార్క్రమ్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 68 నాటౌట్) కూడా జోరు ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్కు 54 బంతుల్లో 94 పరుగులు జోడించి హైదరాబాద్ విజయానికి బాటలు వేశారు.