ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమి తమ జట్టుకు ఓ గుణపాఠమని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ గేమ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో కేకేఆర్ను ఓడించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా చరిత్రకెక్కింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) , శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. 262 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోకపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఎక్కడ తప్పు చేశామో కూడా అర్థం కావడం లేదని చెప్పాడు.
'ఇరు జట్ల బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. కళ్లు చెదిరే బ్యాటింగ్తో చెలరేగారు. సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ కనువిందు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సైతం అద్భుతంగా ఆడారు. ఈ మ్యాచ్లో ఎక్కడ తప్పిదం చేశామో అర్థం కావడం లేదు. 260 పరుగులను కాపాడులేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. బాధగా ఉంది.
డ్రాయింగ్ బోర్డ్పైనే తప్పిదాలు తెలుసుకోవాలి. ఈ పరాజయం మాకు ఓ గుణపాఠం. మేం పిచ్ కండిషన్స్కు తగ్గట్లు వ్యూహాలు రచించాల్సి ఉంది. బంతిని నరైన్ కొట్టిన విధానం అద్భుతంగా ఉంది. అతను ఇదే జోరును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. మా జట్టుకు అతను అత్యంత కీలమైన ఆటగాడు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.