
డిఫెన్స్ ఆడితే..
'నేను డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుని మ్యాచ్ను చూస్తుంటే చాలా ఉత్కంఠగా అనిపించింది. వెంటవెంటనే వికెట్లు పడిపోతున్నాయి. ఆరంభంలో బంతి బాగా స్వింగ్ అయ్యింది. పేసర్లకు పిచ్ అనుకూలిస్తుందని మా డ్రెస్సింగ్ రూమ్లో ముందే చర్చించుకున్నాం. అందుకు అనుగుణంగా రాణించేందుకు ప్రయత్నించాం. ఈ పిచ్పై బంతిని డిఫెండ్ చేస్తూ ఆడితే ఔటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ధాటిగా ఆడటమే మేలు అనిపించింది.

హిట్ చేయాలనుకున్నా..
అందుకే, బ్యాటింగ్కు వెళ్లే కంటే ముందే దూకుడుగా ఆడాలని గట్టిగా నిర్ణయించుకున్నా. తొలుత సెంచరీ గురించే ఆలోచించలేదు. ఓవర్లో చివరి బంతులకు సింగిల్స్ తీసి నేనే స్ట్రైకింగ్ తీసుకోవాలని కూడా అనుకోలేదు. కానీ నేను 80 పరుగులు పూర్తి చేసిన తర్వాత.. బుమ్రా డిఫెండింగ్ ఆడుతూ పూర్తి సహకారం అందించాడు. ఈ రోజు నాకు కలిసి రాలేదు. స్వల్ప తేడాతో సెంచరీ చేజార్చుకోవడం ఏ మాత్రం బాధలేదు. ఇలాంటివన్నీ ఆటలో సహజమే'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

భారత్దే ఆధిపత్యం..
బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో తొలి రోజు బ్యాట్తో, బంతితో భారత్ సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా (3/15), మహ్మద్ షమీ (2/18)ల ధాటికి లంక 86/6తో నిలిచింది. మాథ్యూస్ (85 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43) చెప్పుకోదగ్గ ఒక్కడే ఇన్నింగ్స్ ఆడాడు. ఆట ఆఖరుకు డిక్వెలా (13), ఎంబుల్దేనియా (0) క్రీజులో ఉన్నారు.

తొలి రోజే 16 వికెట్లు.. రికార్డు..
ఈ పింక్ బాల్ టెస్ట్ అరుదైన రికార్డు నమోదు చేసింది. డే/నైట్ టెస్ట్ మ్యాచ్లో తొలి రోజే 16 వికెట్లు పడటం ఇదే తొలిసారి. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆలౌటవ్వగా.. శ్రీలంక 6 వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు 2017లో సౌతాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్ట్లో తొలి రోజే 17 వికెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత, 2019లో భారత్, బంగ్లాదేశ్ మధ్య, 2021 భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన డే/నైట్ టెస్ట్లో కూడా తొలి రోజే 13 వికెట్లు పడటం విశేషం.


Click it and Unblock the Notifications
