ముంబై: పేలవ బ్యాటింగ్ కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలయ్యామని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఢిల్లీతో గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన కేకేఆర్.. 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన అయ్యర్.. పేలవ బ్యాటింగే కొంపముంచిందన్నాడు. టోర్నీలో మిగిలిన మ్యాచ్ల్లోనైన నిర్భయంగా బ్యాటింగ్ చేసి విజయాలు నమోదు చేయాలన్నాడు. ఉమేశ్ యాదవ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడని, ఈ సీజన్లో సత్తా చాటుతున్నాడని కొనియాడాడు. ఇక తమ టీమ్ కాంబినేషన్ సెట్ కాలేదని, గాయాలు కూడా తమను చికాకుకు గురి చేస్తున్నాయని చెప్పాడు.
'మేం చాలా పేలవంగా ఆరంభించాం. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయాం. వికెట్ కూడా బౌలింగ్కు అనుకూలించింది. దాంతో స్కోర్ బోర్డుపై భారీ పరుగులు ఉంచలేకపోయాం. ఈ ఓటమికి సాకుల్లేవ్. మేమంతా మా తప్పిదాలపై ఆలోచన చేయాలి. పదే పదే ఆటగాళ్లను మార్చడంతో సరైన కాంబినేషన్ సెట్ అవ్వడం లేదు. ఆటగాళ్ల గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే మేం సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే నిర్భయంగా ఆడాలి. బ్యాటింగ్లో సంప్రదాయానికి స్వస్థి పలకాలి.
టోర్నీలో మాకు ఇంకా ఐదు మ్యాచ్లున్నాయి. మేం అద్భుతంగా రాణించాల్సి ఉంది. మన బలాలపై నమ్మకం ఉంచి మనకెంతో చేస్తున్న టీమ్ మేనేజ్మెంట్కు తిరిగిచ్చేయాలి. మా తప్పిదాల గురించి తెలుసుకొని సరిదిద్దుకోవాలి. శక్తిసామర్థ్యాల మేరకు విజయం కోసం కష్టపడాలి. అప్పుడు ఓడినా ఏం కాదు. ఉమేశ్ యాదవ్ ఫస్ట్ బాల్కే వికెట్ తీసి అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. కానీ అదే ఓవర్లో 11 పరుగులు ఇవ్వడంతో మూమెంటమ్ మారిపోయింది. కానీ ఉమేశ్ ఈ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. సూపర్ బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు.'అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది. నితీష్ రాణా (34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 57), శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 4 ఫోర్లతో 42) రాణించారు. కుల్దీప్ యాదవ్(4/14), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/18) కేకేఆర్ పతనాన్ని శాసించగా.. చేతన్ సకారియా, అక్షర్ పటేల్కు ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్ వార్నర్(26 బంతుల్లో 8 ఫోర్లతో 42), రోవ్మెన్ పొవెల్(33 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. హృతీష్ రాణా, నరైన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.