సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసిందని కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఈ బాధ వర్ణాతీతమని, మాటలు రావడం లేదని భావోద్వేగానికి గురయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కేకేఆర్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ఓటమి గురించి మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉందని తెలిపాడు. 'ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. భావోద్వేగాలు మిళితమైన ఈ మ్యాచ్లో మాకు పరాజయం ఎదురవుతుందని ఊహించలేదు. ఇదో ఫన్నీ గేమ్. రోవ్మన్ పోవెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

ఈ ఓటమి గురించి వివరించాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ ఓటమిని మరిచి ముందుకు సాగాలి. ఇలాంటి పరిస్థితుల్లో విజయం సాధించాలంటే అత్యుత్తమ బంతులను బౌలింగ్ చేయాలి. ఈ మ్యాచ్లో మేం చేసిన తప్పిదం అదే. కొన్ని చెత్త బంతులు వేసి మూల్యం చెల్లించుకున్నాం. టోర్నీ చివరి భాగంలో కాకుండా ఇప్పుడే ఇలాంటి ఫలితం ఎదురవ్వడం సంతోషంగా ఉంది.
ఈ పరాజయం నేపథ్యంలో ఆత్మపరిశీలన చేసుకొని బలంగా పుంజుకుంటాం. సునీల్ నరైన్ మా జట్టు గొప్ప ఆస్తి. నరైన్ వంటి ఆటగాడు మా జట్టులో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతీ మ్యాచ్లోనూ అతను బ్యాట్తో సత్తా చాటుతున్నాడు. జోస్ బట్లర్ బంతిని క్లీన్గా హిట్ చేశాడు. పేస్ బౌలింగ్ను సునాయసంగా ఆడుతున్నాడనే చివరి ఓవర్ను వరుణ్ చక్రవర్తీకి ఇచ్చాను.
కానీ జోస్ బట్లర్ తన హిట్టింగ్తో మా ఓటమిని శాసించాడు. ఈ మ్యాచ్ గురించి మరిచి తదుపరి మ్యాచ్ కోసం సిద్దమవుతాం. మరో 2-3 రోజుల్లో మాకు మరో టఫ్ మ్యాచ్ ఉంది. ఈ తప్పిదాల నుంచి నేర్చుకొని పుంజుకోవడం చాలా ముఖ్యం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్(56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్తో 109) విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.