తమ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే క్వాలిఫయర్-1లో విజయం సాధించామని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. తమ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. 'మా జట్టు ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చుతున్నారు. ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఈ సుదీర్ఘ టోర్నీలో గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంలో ఉండటం ముఖ్యం.

ఈ రోజు మేం అదే చేశాం. విజయానికి కావాల్సిన అన్నీ అవకాశాలను అందిపుచ్చుకున్నాం. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు మా బౌలర్లు రాణించారు. వారు వికెట్లు తీసిన విధానం అద్భుతం. మా బౌలర్ల అప్రోచ్, వైఖరి అసాధారణం. వరుసగా వికెట్లు పడగొట్టారు. బౌలింగ్ విభాగంలో విభిన్నత ఉంటే కెప్టెన్ల పని ఈజీ అవుతోంది. మా బౌలర్లు అద్భుత పనీతురు కనబర్చారు.
ఇదే జోరును ఫైనల్లో కూడా కొనసాగిస్తామని ఆశిస్తున్నా. రెహ్మానుల్లా గుర్బాజ్కు ఇదే తొలి మ్యాచ్. అయినా అతను అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. నాకు తమిళం రాదు. కానీ అర్థమవుతోంది. వెంకటేశ్ అయ్యర్ నాతో తమిళంలోనే మాట్లాడుతాడు. నేను హిందీలో బదులిస్తాను. మా ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది. మేం మా జోన్లో ఉంటూ.. ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ప్రయత్నం చేస్తాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఈ గెలుపుతో కేకేఆర్ టైటిల్ ఫైట్కు అర్హత సాధించగా.. సన్రైజర్స్ హైదరాబాద్కు క్వాలిఫయర్-2తో మరో అవకాశం ఉంది. చెన్నై వేదికగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/34) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్.. 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వెంకటేశ్ అయ్యర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 51 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసారు.