నాలుగేళ్లుగా వాట్సాప్ డీపీ..
2017 బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో శ్రేయస్ అయ్యర్ ఉన్న ఫొటోనే అతని తండ్రి సంతోష్ తన వాట్సప్ డీపీగా పెట్టుకున్నాడు. నాలుగేళ్లుగా అతడు ఆ డీపీ మార్చలేదు. దీనికి కారణం సుదీర్ఘ ఫార్మాట్లో తన తనయుడు ఆడాలని ఆశించడమే. ఈ తరుణం కోసం అతడు సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చింది. ''బోర్డర్-గావస్కర్ ట్రోఫీని శ్రేయస్ పట్టుకున్న ఫొటో నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ధర్మశాలలో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కోహ్లీకి ప్రత్యామ్నాయంగా అయ్యర్ను ఎంపిక చేశారు. అందుకే ఈ సిరీస్ గెలిచిన తర్వాత శ్రేయస్ చేతుల్లో ట్రోఫీ ఉండాలని అప్పటి జట్టు సభ్యులు అనుకున్నారు. ఆ క్షణం ఎంతో అమూల్యం. ఎందుకంటే అప్పుడు అతను భారత జట్టుకు ఆడినట్లే అనిపించింది. అందుకే అప్పటి నుంచి ఆ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకున్నాను. ఇప్పుడు న్యూజిలాండ్పై అతడు అరంగేట్రం చేసిన క్షణం ఎంతో విలువైంది. ఐపీఎల్, వన్డే వీటన్నిటికంటే ఇదెంతో అమూల్యం'' అని శ్రేయస్ తండ్రి సంతోష్ చెప్పారు.
అచ్చొచ్చిన కాన్పూర్లో..
2014లో ముంబై తరఫున రంజీ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. తొలి రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. మూడో మ్యాచ్లోనూ ముంబై జట్టు 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తీవ్ర ఒత్తిడిలో అయ్యర్ బరిలో దిగాడు. ఈ మ్యాచ్లో అతను సత్తా చాటకపోతే జట్టులో స్థానం గల్లంతైనట్టే! ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మ్యాచ్ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడి ముంబైని గెలిపించాడు. తన కెరీర్ ఎక్కడ మలుపు తిరిగిందో అదే కాన్పూర్లో న్యూజిలాండ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే అదిరే ఆటతో ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. 54 ఫస్ట్ క్యాచ్ మ్యాచ్లు ఆడిన తర్వాత 4592 పరుగులు చేశాక శ్రేయస్ అయ్యర్కు టెస్ట్ల్లో అవకాశం దక్కింది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా క్యాప్ అందుకోవడంతో అయ్యర్ కల నేరవేరింది.
విమర్శలకు ఆటతోనే సమాధానం..
అయితే ఈ మ్యాచ్కు ముదు ఈ రెండు టెస్ట్లకు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి రెండేళ్లు అయిందని, పైగా తీవ్ర భుజగాయనికి గురై ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న అతన్ని ఎంపిక చేయడం సరికాదని విమర్శకులు పెదవివిరిచారు. మిడిలార్డర్లో కొంచెం వేగంగా ఆడే ఆటగాడు అవసరమని, దానికి అయ్యరే సరైనోడని భావించిన సెలెక్టర్లు.. టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారిని కాదని చాన్స్ ఇచ్చారు. విమర్శలు వచ్చినా.. టీమ్మేనేజ్మెంట్ వెనక్కు తగ్గలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న అయ్యర్.. టీమ్ కోరుకున్న విధంగా దూకుడైన బ్యాటింగ్తో భారత ఇన్నింగ్స్ను ట్రాక్లోకి తెచ్చాడు. విమర్శలను తన ఆటతో తిప్పి కొట్టాడు.
తడబడిన భారత్..
258/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ జోరు కొనసాగించలేకపోయింది. ఓవర్ నైట్ స్కోర్కు కేవలం 8 పరుగులు జోడించిన అనంతరం రవీంద్ర జడేజా (50) టిమ్ సౌథీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సాహ పూర్తిగా నిరాశ పరిచాడు. సాహ (1) టిమ్ సౌథీ బౌలింగ్లో బ్లండెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సెంచరీ చేసిన వెంటనే అదే జోరులో చెత్తా షాట్తో అయ్యర్ ఔటయ్యాడు. టిమ్ సౌథీ బౌలింగ్లో యంగ్కు క్యాచ్ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(3) కూడా విఫలమయ్యాడు. సౌథీ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన టెయిలండర్ ఉమేశ్ యాదవ్(2 బ్యాటింగ్)తో అశ్విన్(33 బ్యాటింగ్) పోరాడుతున్నాడు.