ఆసియా కప్ 2025 టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా జరిగే ఈ హోమ్ సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్తో టీమిండియా ఈ డబ్ల్యూటీసీ సైకిల్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డపై అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత్.. ఈ సిరీస్ను 2-2తో సమం చేసుకుంది.
సొంతగడ్డపై వెస్టిండీస్తో పాటు సౌతాఫ్రికాతో వరుసగా టెస్ట్ సిరీస్లు ఆడనుంది. ఈ హోమ్ సిరీస్ల్లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తే డబ్ల్యూటీసీ 2027 ఫైనల్ చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఎందుకంటే విదేశీ గడ్డపై టీమిండియా ఆడే టాప్ సిరీస్లు ఎక్కువగా లేవు. సెనా దేశాల్లో న్యూజిలాండ్ గడ్డపై మాత్రమే టీమిండియా రెండు టెస్ట్లు ఆడనుంది. ఈ క్రమంలోనే హోమ్ సీజన్ టీమిండియాకు కీలకంగా మారింది.
అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఆడే భారత టెస్ట్ టీమ్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంగ్లండ్ గడ్డపై నిరాశపర్చిన కరుణ్ నాయర్పై వేటు పడనుంది. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు పిలుపు అందుకున్న కరుణ్ నాయర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లండ్తో మాములుగానే రాణించిన సాయి సుదర్శన్కు మరో అవకాశం దక్కనుంది. ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్ సాధిస్తే మాత్రం సాయి సుదర్శన్కు చోటు దక్కకపోవచ్చు.

శుభ్మన్ గిల్ సారథిగా జట్టును నడిపించనుండగా.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్లు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. శ్రేయస్ అయ్యర్ నెంబర్ 3 లేదా నెంబర్ 4లో ఆడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా నెంబర్ 3 ఆటగాడి నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. ఆ స్థానాన్ని వెస్టిండీస్ సిరీస్లో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో పూర్తిగా బెంచ్కే పరిమితమైన అభిమన్యు ఈశ్వరన్కు కూడా అవకాశం దక్కనుంది. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు. అతనికి ఏమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే మాత్రం శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు.
స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కనుంది. ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే అక్షర్ పటేల్ ఎంపికవుతాడు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అయితే అర్ష్దీప్ సింగ్కు ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ పోటీగా రానున్నారు. వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ ఎంపికవ్వనుండగా.. రిషభ్ పంత్ బరిలోకి దిగడంపై సందేహం నెలకొంది. అతను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. బ్యాకప్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ను తీసుకోవచ్చు. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ఈ సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్/ సర్ఫరాజ్ ఖాన్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(కీపర్), వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, ప్రసిధ్ కృష్ణ/ఆకాష్ దీప్/అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్/ఇషాన్ కిషన్.