ముంబై టీ20 ప్రీమియర్ లీగ్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్ ఓటమిపాలైంది. 9 రోజుల వ్యవధిలోనే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ రెండు ఫైనల్ మ్యాచ్ల్లో ఓటమి చవిచూశాడు. ఈ నెల 3న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ నడిపించిన పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఇక గురువారం జరిగిన ముంబై ప్రీమియర్ టీ20 లీగ్ ఫైనల్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠ రాయల్స్ చేతిలో శ్రేయస్ నడిపించిన ముంబై ఫాల్కన్స్ జట్టు ఓటమిపాలైంది. ఈ రెండు ఫైనల్లోనూ శ్రేయస్ అయ్యర్ బ్యాటర్గా విఫలమయ్యాడు. టీ20 ఫార్మాట్లో అద్భుతమైన కెప్టెన్గా ప్రశంసలు అందుకుంటున్న అయ్యర్.. కీలక మ్యాచ్ల్లో బ్యాట్తో రాణించలేక విమర్శల పాలవుతున్నాడు.

తాజా ఫైనల్లో శ్రేయస్ అయ్యర్(17 బంతుల్లో 12) వైఫల్యంతో ముంబై ఫాల్కన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులే చేసింది. అనంతరం ముంబై సౌత్ సెంట్రల్ మరాఠ రాయల్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసి గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. అయితే ఈ ఓటమికి జట్టులో ఏ ఒక్కర్ని నిందించలేనని స్పష్టం చేశాడు. 'ఈ ఓటమికి ఒకర్ని నిందిస్తూ.. ఓ ప్రత్యేకమైన సంఘటన కారణమని నేను చెప్పాలనుకోవడం లేదు. ఓవరాల్గా మా జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. ఫైనల్కు చేరే క్రమంలో మేం ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. ఫైనల్లోనే ఓటమిపాలయ్యాం. ఈ టోర్నీ మేం ఓడించి ఒకే ఒక్క మ్యాచ్. కాబట్టి ఈ ఓటమికి నేను ఎవర్నీ నిందించలేను.
అలా చేస్తే ఓ ఆటగాడికి వెన్ను పోటు పోడిచినట్లు అవుతుంది. అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఫైనల్లో ఓడిన తర్వాత నిరాశకు గురవ్వడం సర్వసాధారణం. ఈ ఓటమి మా ఆటగాళ్లకు బాధ కలిగించి ఉంటుంది. కానీ వచ్చే ఏడాదికి ఈ ఓటమి అదనపు ప్రేరణగా.. ఆత్మవిశ్వాసంగా మారుతుంది. మా కుర్రాళ్లు వారి ప్రదర్శన పట్ల గర్వపడాలి. వరుసగా రెండు ఫైనల్లో ఓడిపోవడం బాధగానే ఉంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.