అసలేం జరిగిందంటే..?
25 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి క్రీజులో సెటిల్ అయిన శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వెనుదిరిగాడు. ఉమ్రాన్ మాలిక్ను షార్ట్ పిచ్ బాల్ వేసేలా శ్రేయాస్ అయ్యర్ ఉసిగొల్పగా.. అతను మాత్రం గంటకి 148 వేగంతో యార్కర్ విసిరాడు. దాంతో.. బంతిని కనీసం టచ్ కూడా చేయలేకపోయిన శ్రేయాస్ అయ్యర్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్.. గంటకి 145-150 కిమీ వేగంతో వరుసగా బంతులేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఐదో బంతిని అతను షార్ట్ పిచ్ రూపంలో 147.5కిమీ వేగంతో విసరగా.. శ్రేయాస్ అయ్యర్ టచ్ కూడా చేయలేకపోయాడు.

అప్పర్ కట్ కొట్టాలని..
దాంతో.. తర్వాత బంతిని కూడా షార్ట్ పిచ్ రూపంలో ఉమ్రాన్ మాలిక్ వేసేలా.. శ్రేయాస్ అయ్యర్ మైండ్ గేమ్ ఆడాడు. ఉమ్రాన్ మాలిక్ ఆఖరి బంతిని విసిరేందుకు రనప్తో వస్తుండగానే.. ఆఫ్ స్టంఫ్ లైన్పైకి వెళ్లిన శ్రేయస్ అయ్యర్.. మళ్లీ వెనక్కి వచ్చాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్ అలా బ్యాటర్ ఆఫ్ స్టంప్ లైన్పైకి వెళ్లగానే.. షార్ట్ పిచ్ రూపంలో బాడీ పైకి బంతిని సంధిస్తుంటారు. ఉమ్రాన్ మాలిక్ కూడా అలానే విసిరితే? అప్పుడు వెనక్కి వచ్చి థర్డ్ మ్యాన్ దిశగా అప్పర్ కట్ కొట్టాలని శ్రేయాస్ అయ్యర్ ప్లాన్ చేసుకున్నాడు.

అప్పడం అయిపోయింది..
కానీ.. శ్రేయస్ ప్లాన్ బెడిసికొట్టింది. అతను ముందుకు వెళ్లి.. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి ఫుట్ వర్క్ని సెట్ చేసుకునేలోపే బంతి వెళ్లి వికెట్లని గీరాటేసింది. దాంతో అప్పర్ కట్ ప్లాన్ కాస్త అప్పడం అయిపోయింది. కళ్లుచెదిరే రీతిలో ఉమ్రాన్ మాలిక్ యార్కర్ విసిరి వికెట్ తీయడంతో.. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ డగౌట్లో మురళీధరన్తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ తర్వాత బంతిని యార్కర్ వేయబోతున్నాడని మురళీధరన్ ముందే చెప్పాడని మ్యాచ్ అనంతరం డేల్ స్టెయిన్ తెలిపాడు. అలా వేస్తే.. ఉమ్రాన్ తలపై నుంచి అయ్యర్ బౌండరీ కొడతాడని చెప్పి కూర్చునేలోపే.. వికెట్ పడిందన్నాడు. దాంతో ఎగిరి గంతేసానని, మురళీధరన్ను అభినందించానన్నాడు.

గెలిపించిన త్రిపాఠి, మార్క్రమ్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 54), ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 49 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, నటరాజన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది.
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రాహుల్ త్రిపాఠి (37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 71) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగగా, మార్క్రమ్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 68 నాటౌట్) కూడా జోరు ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్కు 54 బంతుల్లో 94 పరుగులు జోడించి హైదరాబాద్ విజయానికి బాటలు వేశారు.


Click it and Unblock the Notifications
