టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దుమ్మురేపాడు. ప్రాణాంతక గాయం తర్వాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ , ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్లో ముంబైకి సారథ్యం వహిస్తున్న అయ్యర్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి టీ20 తరహాలో ఆడాడు. 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 82 పరుగులతో రాణించాడు. క్యాచ్ ఔట్గా వెనుదిరిగి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వర్షం అంతరాయ కలిగించిన ఈ మ్యాచ్ను అంపైర్లు 33 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 33 ఓవర్లలో 9 వికెట్లకు 299 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. అయ్యర్తో పాటు ముషీర్ ఖాన్(51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 73) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఈ ప్రదర్శనతో శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్కు క్లియరెన్స్ లభించనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అతని పక్కటెముకల కింద ఉన్న ప్లీహానికి తీవ్ర గాయం కావడం, అంతర్గత రక్త స్రావం కావడంతో అయ్యర్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.
భారత ఫిజియోల అప్రమత్తతతో ప్రాణాంతక గాయం నుంచి అయ్యర్ బయటపడ్డాడు. గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన అయ్యర్.. ఇటీవలే బెంగళూరులోని సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ)లో చేరి రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. సీఓఈలో ఇప్పటికే తన తొలి 50 ఓవర్ల రిటర్న్ టు ప్లే మ్యాచ్ ఆడిన అయ్యర్.. రెండో రిటర్న్ టు ప్లే మ్యాచ్గా విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో రాణించడంతో అతని ఫిట్నెస్కు క్లియరెన్స్ లభించనుంది.
ఇప్పటికే న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసిన సెలెక్టర్లు ఫిట్నెస్ నిరూపించుకోవాలని పేర్కొన్నారు. తాజా ప్రదర్శనతో అయ్యర్ అంతర్జాతీయ రీఎంట్రీకి మార్గం సుగుమమైంది. తొలి వన్డే జనవరి 11న వడోదర, రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్ వేదికగా, మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరగనుంది.