ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా 5 టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్తో డబ్ల్యూటీసీ 2027 సైకిల్ ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు ఎంపిక సెలెక్టర్లకు సవాల్గా మారింది.
కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా? అనేది చర్చనీయాంశమైంది. అయితే కోహ్లీ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ మాత్రమే భర్తీ చేయగలడని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కుతుందని భావిస్తున్నారు. అయితే గతేడాది సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ మధ్యలోనే శ్రేయస్ అయ్యర్పై వేటు పడింది. ఫిట్నెస్ సమస్యలతో పాటు బ్యాటింగ్ టెక్నిక్లో లోపం ఉండటంతో సెలెక్టర్లు జట్టు నుంచి తప్పించారు.

మరోసారి ఆ బలహీనతల కారణంగానే ఇంగ్లండ్ పర్యటనకు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఆడటంలో శ్రేయస్ అయ్యర్ తడబడ్డాడు. దాంతో ప్రతీ జట్టు శ్రేయస్ అయ్యర్ రాగానే షార్ట్ పిచ్ బాల్స్ వేస్తూ అందుకు అనుగుణంగా ఫీల్డ్ సెటప్ చేసి ఫలితం రాబట్టారు. ఈ బలహీనతపై వర్క్ చేసిన శ్రేయస్ అయ్యర్.. దాన్ని బలంగా మార్చుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో షార్ట్ పిచ్ బాల్స్ను బౌండరీకి తరలించి పరుగులు రాబట్టాడు. ఐపీఎల్లోనూ చెలరేగుతున్నాడు.
షార్ట్ పిచ్ బాల్స్ వేసిన బౌలర్లను తనదైన శైలిలో శిక్షిస్తున్నాడు. అయితే వైట్ బాల్ క్రికెట్లో రాణించినట్లు.. టెస్ట్ ఫార్మాట్లో షార్ట్ పిచ్ బాల్స్ను బౌండరీలకు తరలించడం అంత సులువు కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. విదేశీ పిచ్లు సహజంగానే బౌన్సీగా ఉంటాయి. ఈ క్రమంలోనే విదేశీ టెస్ట్ సిరీస్ల్లో శ్రేయస్ అయ్యర్ను ఆడించి రిస్క్ చేసే యోచనలో భారత సెలెక్టర్లు లేరు. సొంతగడ్డపై టెస్ట్ మ్యాచ్లు ఆడించిన తర్వాతే.. అతన్న విదేశీ పర్యటలకు ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే గతేడాదిగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఆ ఫామ్ కొనసాగిస్తున్నాడు.