ఐపీఎల్ 2024 సీజన్ ప్రిపరేషన్స్ కోసం రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న టీమిండియా యువ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దమైనట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి ఈ ఇద్దరిని తొలగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ 2023లో శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ బి కాంట్రాక్ట్తో రూ. 3 కోట్ల వార్షిక వేతనం పొందుతుండగా.. గ్రేడ్ సీలో ఉన్న ఇషాన్ కిషన్ ఏడాదికి కోటీ రూపాయల జీతం అందుకుంటున్నాడు. అయిదే బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న ఈ ఇద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి తొలిగించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.

అతిత్వరలోనే 2024కు సంబంధించిన కాంట్రాక్ట్స్ను బీసీసీఐ ప్రకటించనుంది. మానసిక సమస్యలతో సౌతాఫ్రికా పర్యటన నుంచి అర్థాంతరంగా తప్పుకున్నఇషాన్ కిషన్.. కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో కలిసి ఐపీఎల్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టాడు.
మరోవైపు రంజీ క్రికెట్ ఆడాలని టీమిండియా మేనేజ్మెంట్ చేసిన సూచనలను అతను పట్టించుకోలేదు. దాంతో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ఇషాన్ కిషన్ను ఎంపిక చేయలేదు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్ల్లో దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్పై టీమిండియా మేనేజ్మెంట్ వేటు వేయగా.. అతను వెన్ను నొప్పి అంటూ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు.
అయితే అయ్యర్కు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని ఎన్సీఏ అధికారులు బీసీసీఐకి నివేదిక అందజేశారు. మరోవైపు రంజీ క్రికెట్ ఆడకపోవడంతో బోర్డు పెద్దలతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆగ్రహంగా ఉన్నారు. బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేకుండా.. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆదేశించారు. స్వయంగా లేఖలు కూడా రాసారు. అయినా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు ఈ ఆదేశాలను పట్టించుకోలేదు.
'అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ.. టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్ను ఫైనలైజ్ చేసింది. అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. ఈ సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి ఇషాన్ కిషన్, అయ్యర్లను తొలగించే అవకాశం ఉంది. బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేస్తూ దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంపై బోర్డు ఆగ్రహంగా ఉంది.'అని ఓ అధికారి మీడియాతో అన్నారు.