ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే తొడ కండరాల గాయంతో నితీష్ కుమార్ రెడ్డి ఆఖరి మ్యాచ్కు దూరం కాగా.. తాజాగా శ్రేయస్ అయ్యర్ ఈ జాబితాలో చేరాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయమైనా క్యాచ్ను మాత్రం వదిలేయలేదు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు, మాజీ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
హర్షిత్ రాణా వేసిన 34వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని అలెక్స్ క్యారీ ఎక్స్ట్రా కవర్ దిశగా ఆడగా.. బ్యాక్వార్డ్ పాయింట్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ పరుగెత్తుకొచ్చి అద్భుతంగా అందుకున్నాడు. బంతిని అందుకునే క్రమంలో అదుపు తప్పిన అయ్యర్.. ఎడమవైపు పడిపోయాడు.

ఈ క్రమంలో అతని ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. అతని ఎడమ పక్కటెముకలకు తీవ్ర గాయమైనట్లు అనిపించింది. తీవ్ర నొప్పితో అయ్యర్ విలవిలలాడాడు. ఫిజియో సాయంతో మైదానం వీడిన అయ్యర్.. బ్యాటింగ్కు దిగుతాడా? లేదా? అనేది సందేహంగా మారింది. అతను విలవిలలాడటం చూస్తే గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు అనిపించింది. అతను బ్యాటింగ్కు దిగకపోతే టీమిండియా 9 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఇది భారత విజయవకాశాలపై ప్రభావం చూపనుంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 198 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మాథ్యూ రేన్ షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మాథ్యూ షార్ట్(30) కీలక ఇన్నింగ్స్ ఆడారు. క్రీజులో మిచెల్ స్టార్క్(2 బ్యాటింగ్)తో పాటు కూపర్ కన్నోల్లి(1 బ్యాటింగ్)) ఉన్నారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.