ఆసియా కప్ 2025 నేపథ్యంలో భారత జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఆటగాళ్లు, ఐపీఎల్ స్టార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవర్ని ఎంపిక చేయాలి? మరెవర్ని పక్కనపెట్టాలనే విషయాన్ని అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ తేల్చుకోలేకపోతుంది. ఒక్కో ప్లేస్కు ముగ్గురు నుంచి నలుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్గా బ్యాటర్గా దుమ్మురేపిన శుభ్మన్ గిల్.. గతేడాదిగా టీమిండియా టీ20 జట్టులో లేడు. ఐపీఎల్ 2025 సీజన్తో పాటు ఇంగ్లండ్ గడ్డపై మెరుగైన ప్రదర్శనతో శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతన్ని తీసుకోవాలా? లేదా? అనే విషయంపై అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. అతనితో పాటు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

మంగళవారం ముంబై వేదికగా ఆసియా కప్ బరిలోకి దిగే భారత జట్టును సెలెక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం 15వ ఆటగాడి ప్లేస్ కోసం శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. కెప్టెన్గా బ్యాటర్గా సత్తా చాటి 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు తీసుకెళ్లాడు. దాంతో అయ్యర్ను తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పాకిస్థాన్తో మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకోవాలంటే అనుభవం కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉండాలనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు రింకూ సింగ్ ఫినిషర్గా జట్టులో కొనసాగుతున్నాడు.
చివర్లో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడం అతని స్పెషాలిటీ. కానీ ఐపీఎల్ 2025 సీజన్తో పాటు అతను ఆడిన చివరి అంతర్జాతీయ టీ20ల్లో తీవ్రంగా నిరాశపర్చాడు. రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా జట్టుకు అడ్వాంటేజ్గా మారనున్నాడు. ఇప్పటికే భారత్ తరఫున అతను సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మరీ సెలెక్టర్లు ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి.