ప్రతిష్టాత్మక విజయ్ హాజరే ట్రోఫీ 2025 టోర్నీలో బరిలోకి దిగిన భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ తీవ్రంగా నిరాశపర్చారు. మంగళవారం జరిగిన ఐదో రౌండ్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ల్లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన శుభ్మన్ గిల్.. 12 బంతుల్లో 11 పరుగులే చేసి వెనుదిరిగాడు.
గోవాతో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన శుభ్మన్ గిల్.. తీవ్రంగా నిరాశపరిచాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అతని వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ అనంతరం శుభ్మన్ గిల్ ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో మెడనొప్పికి గురైన అతను.., టీ20తో పాటు వన్డే సిరీస్కు దూరమయ్యాడు. విజయ్ హజారేతోనే రీఎంట్రీ ఇచ్చిన గిల్ తీవ్రంగా నిరాశపర్చాడు.

హిమాచల్ ప్రదేశ్తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్(15), సూర్యకుమార్ యాదవ్(24) విఫలమయ్యారు. గాయం తర్వాత బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్(82) మాత్రం టీ20 తరహా బ్యాటింగ్తో చెలరేగాడు.
ఈ మ్యాచ్లో ముంబైకి సారథ్యం వహించిన అయ్యర్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి టీ20 తరహాలో ఆడాడు. 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 82 పరుగులతో రాణించాడు. క్యాచ్ ఔట్గా వెనుదిరిగి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వర్షం అంతరాయ కలిగించిన ఈ మ్యాచ్ను అంపైర్లు 33 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 33 ఓవర్లలో 9 వికెట్లకు 299 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. అయ్యర్తో పాటు ముషీర్ ఖాన్(51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 73) హాఫ్ సెంచరీతో రాణించాడు.
హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన మహమ్మద్ సిరాజ్(4/58) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. బెంగాల్తో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్లోనే మహమ్మద్ షమీ(3/70) మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, గిల్, శ్రేయస్, జైస్వాల్.. బుధవారం బరోడాకు వెళ్లనున్నారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో అక్కడ జట్టుతో చేరనున్నారు. న్యూజిలాండ్తో తొలి వన్డే జనవరి 11న వడోదర, రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్ వేదికగా, మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరగనుంది.