ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోవడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. ఫాలో అప్ కోసం శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోనే ఉంటాడని తెలిపింది. శ్రేయస్ అయ్యర్కు మెరుగైన చికిత్స అందించిన సిడ్నీ, భారత వైద్యులకు ధన్యవాదాలు తెలిపింది.
'ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతని పక్కటెముకల కింది భాగంలోని ప్లీహంలో చీలిక వచ్చి అంతర్గత రక్త స్రావమైంది. ఈ గాయాన్ని వెంటనే గుర్తించిన వైద్యులు.. చిన్న శస్త్ర చికిత్సతో రక్త స్రావాన్ని అరికట్టారు. ప్రస్తుత అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వేగంగా కోలుకుంటున్నాడు. బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీ, భారత్లోని వైద్య నిపుణులంతా అయ్యర్కు మెరుగైన చికిత్స అందించారు. గాయం నుంచి కోలుకున్న అయ్యర్ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

శ్రేయస్కు అత్యుత్తమ చిక్సిత అందించిన సిడ్నీ డాక్టర్ కౌరూష్ హగిగి, ఆయన బృందానికి ధన్యావాదాలు. అలాగే అయ్యర్ గాయాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించిన భారత ప్రముఖ డాక్టర్ దిన్షా పార్దివాలకు బీసీసీఐ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. తదుపరి ఫాలో అప్ కోసం కొన్ని రోజులు శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోనే ఉంటారు. వైద్యుల సూచనల మేరకే అతను భారత్కు తిరిగి వస్తాడు.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.
అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు అతనికి రెండు నెలల సమయం పట్టనుంది. ఈ లెక్కన అతను సౌతాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ సిరీస్లకు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. మళ్లీ ఐపీఎల్ 2026 సీజన్తోనే మైదానంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.