ఆ ఇద్దరి బ్యాటింగ్ అమోఘం.. ఇది మా అందరి విజయం: శ్రేయస్ అయ్యర్
జింబాబ్వేతో రెండో టీ20లో విజయం సాధించడంపై టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది సమష్టి విజయమని, ఈ మ్యాచ్ గెలిచిన తీరు చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపాడు.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 90 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్పై ప్రశంసల జల్లు కురిపించాడు. అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని కొనియాడాడు.

వారి షాట్స్ అమోఘం..
ఈ మ్యాచ్ గెలిచిన తీరు చాలా సంతోషాన్నిచ్చింది. ఇది సంపూర్ణ విజయం. జట్టులోని ప్రతీ ఒక్కరు ఈ విజయంలో భాగమయ్యారు. ముఖ్యంగా బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఈ ఇద్దరు ఆడిన కొన్ని షాట్లు అయితే అమోఘం. ఆ షాట్స్ కనువిందు చేశాయి.
180-200 మధ్య స్కోర్ చేస్తే సరిపోతుందనుకున్నా. కానీ మేం 220 పరుగులు చేశాం. ఇది మా విజయానికి మరింత వన్నెతెచ్చింది. తిలక్, ఇషాన్ నుంచి అద్భుతమైన భాగస్వామ్యం లభించింది. బౌలింగ్లో ఎప్పటిలాగే మా బౌలర్లు సత్తా చాటారు. సరైన లైన్ అండ్ లెంగ్త్ల్లో బౌలింగ్ చేసి జింబాబ్వేను 130 పరుగులకు ఆలౌట్ చేశారు.
ఆఖరి మ్యాచ్లో మార్పులు ఉంటాయి..
మా జట్టు ఫియర్లెస్ గేమ్ ఆడింది. అలా ఆడాలి కూడా. ఈ మ్యాచ్కు ముందు మా ఆటగాళ్లకు నేను చెప్పింది ఒక్కటే. గత ప్రదర్శనల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగాలి. ప్రస్తుతం కాలంలో ఉండాలి. మీకు లభించే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాను.
రేపటి మ్యాచ్ మాకు మరో అవకాశం. దాని కోసం ఎదురు చూస్తున్నాం. చివరి టీ20లో తుది జట్టులో చేసే మార్పుల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంకా మా కోచ్తో మాట్లాడలేదు. దురదృష్టవశాత్తు ప్రిన్స్ యాదవ్ గాయపడ్డాడు. కాబట్టి ఒక రెండు మార్పులు జరిగే అవకాశం ఉంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
భారత్ ఘన విజయం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 81), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 60 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వైభవ్ సూర్యవంశీ(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20) మెరుపులు మెరిపించగా.. శ్రేయస్ అయ్యర్(20 బంతుల్లో 4 ఫోర్లతో 25) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, రిచర్డ్ నగర్వ, బ్రాడ్ ఇవాన్స్, న్యూమాన్ న్యామురి, బ్రియాన్ బెన్నెట్ తలో వికెట్ తీసారు.
అనంతరం జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. బ్రియాన్ బెన్నెట్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 32), ర్యాన్ బర్ల్(18 బంతుల్లో 2 ఫోర్లతో 20), మరుమని(19 బంతుల్లో ఫోర్, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ(3/17) మూడు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్(2/30), ప్రిన్స్ యాదవ్(2/10) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ తలో వికెట్ తీసారు. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆదివారం హరారే వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


