భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని ఉద్దేశించి టీమిండియా స్టార్ బ్యాటర్, కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్గా తాను సాధించిన ఐపీఎల్ 2024 విజయం బీసీసీఐకి చెంపపెట్టు అని తెలిపాడు. భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తనను తొలగించడంపై శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు.
మిస్ కమ్యూనికేషన్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లు ఆడిన శ్రేయస్ అయ్యర్.. పేలవ ప్రదర్శనతో తుది జట్టు నుంచి చోటు కోల్పోయాడు. భారత జట్టు నుంచి తప్పుకున్న శ్రేయస్ అయ్యర్ను దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచించింది. కానీ అయ్యర్.. తనకు వెన్ను గాయం ఉందని సాకులు చెప్పాడు.

కానీ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) అయ్యర్ ఫిట్గా ఉన్నాడని పేర్కొంది. అయితే శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ ఆడకుండా.. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రిపరేషన్స్ మొదలుపెట్టాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై ఆగ్రహానికి గురైన బోర్డు.. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లంతా.. ఫిట్నెస్ సమస్యలు లేకుంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించింది.
లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఆదేశాలను శ్రేయస్ అయ్యర్తో పాటు ఇషాన్ కిషన్ బేఖాతరు చేశారు. దాంతో ఈ ఇద్దరినీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. దాంతో తన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేసిన శ్రేయస్ అయ్యర్.. రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. ఆ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం ఐపీఎల్లో తన అసాధారణ సారథ్యంతో టైటిల్ అందుకున్నాడు. తాజాగా అయ్యర్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా.. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడంపై స్పందించాడు. 'టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. నా ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ పెట్టాలనుకున్నాను.
నా శరీరాన్ని ధృడంగా మార్చాలనుకున్నాను. కానీ మిస్ కమ్యూనికేషన్ కారణంగా నాకు ప్రతికూలమైన నిర్ణయాలు వచ్చాయి. అప్పుడే నేను వీటికి బ్యాట్తోనే సమాధానం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అద్భుత ప్రదర్శన కనబర్చి టైటిల్ గెలవాలనుకున్నా. అనుకున్నట్లుగానే రంజీ ట్రోఫీ, ఐపీఎల్ టైటిల్ సాధించాను.
ఈ నా విజయాలు నాకు ప్రతికూలంగా తీసుకున్న నిర్ణయాలకు చెంపపెట్టు. నా విజయాల పట్ల నేను గొప్పగా ఫీలవుతున్నా.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.