టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి అడుగుపెడితే అభిమానులు చేసి గోల, అల్లరి మాములగా ఉండదు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా..ధోనీ వస్తున్నాడంటే అతని నామస్మరణతో స్టేడియాలు దద్దరిల్లుతాయి. అలాంటి ధోనీ ఒకసారి మైదానంలోకి వస్తే మైదానం మొత్తం మూగబోయింది. ఒక్కరు కూడా నోరు తెరవలేకపోయారు. ఆ ఘటన గురించి చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ధోనీ కెరీర్లోనే ఓ మాయని మచ్చగా నిలిచిపోయిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నాడు.
ఐపీఎల్ 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో నో బాల్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.ఆ ఘటన జరిగిన సమయంలో శ్రేయాస్ గోపాల్.. రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్నాడు. అప్పుడు మైదానంలో ఏం జరిగిందో తాజాగా అతను వెల్లడించాడు.

'జైపూర్ వేదికగా జరిగిన నాటి మ్యాచ్లో సీఎస్కే గెలవడానికి ఆఖరి ఓవర్లో 18 పరుగులు అవసరమయ్యాయి. బెన్ స్టోక్స్ వేసిన ఆ ఓవర్ నాలుగో బంతి.. మిచెల్ సాంట్నర్ నడుము కంటే ఎత్తులో వచ్చింది. ఫీల్డ్ అంపైర్ ముందు నోబాల్గా సిగ్నల్ ఇచ్చాడు. అయితే లెగ్ అంపైర్ కాదని చెప్పడంతో నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ధోనీ.. తన స్వభావానికి విరుద్దంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దాంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.
ఆ సమయంలో నేను ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్నాను. ధోనీ నన్ను దాటుకొనే వెళ్లాడు. ఏదో పెద్ద విషయం జరగబోతుందని నాకు అనిపించింది. ప్రపంచంలోనే చాలా ప్రశాంతంగా, కూల్గా ఉండే క్రికెటర్గా గుర్తింపుపొందిన ధోనీ అలా మైదానంలోకి వచ్చాడంటేనే.. ఏదో ఒకటి అతన్ని నిజంగా ఇబ్బంది పెట్టి ఉండాలి లేదా ఏదో తప్పిదం జరగాలి.
ఆ సమయంలో మైదానం మొత్తం మూగబోయింది. ఎవరూ మాట్లాడలేదు. ధోనీ మైదానంలోకి వస్తుండగా మైదానంలో నిశ్శబ్దం అలుముకోవడం ఆ ఒక్కసారి మాత్రమే చూశాను.'అని సీఎస్కే యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయాస్ గోపాల్ చెప్పుకొచ్చాడు. మైదానంలోకి ఇలా వెళ్లడం తన తప్పేనని ధోనీ ఓ ఇంటర్వ్యూలో అంగీకరించాడు. నాటి ఘటనలో ధోనీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.