శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత మహిలా బౌలర్లు నిప్పులు చెరిగారు. వరల్డ్ కప్ ఫామ్ను కొనసాగిస్తూ.. తెలుగు తేజం శ్రీ చరణి(2/23)రఫ్ఫాడించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది.
కెప్టెన్ చమరి ఆటపట్టు(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), హర్షిత్ సమరవిక్రమా(32 బంతుల్లో 4 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలవగా.. హాసిని పెరారా(28 బంతుల్లో 3 ఫోర్లతో 22) కాస్త ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో శ్రీచరణితో పాటు వైష్ణవి శర్మ(2/32) రెండేసి వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు మరోసారి ఆశించిన ఆరంభం దక్కలేదు. క్రాంతి గౌడ్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ విష్మి గుణరత్నే(1) రిటర్న్ క్యాచ్గా వెనుదిరిగింది. క్రీజులోకి వచ్చిన హాసిని పెరెరాతో కలిసి కెప్టెన్ చమరి ఆటపట్టు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ జోడీ ఆచితూచి ఆడటంతో శ్రీలంక స్కోర్ బోర్డు నత్తనడకన సాగింది.

దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఆటపట్టు ఔటవ్వడంతో పవర్ ప్లేలో భారత్ రెండు వికెట్లకు 39 పరుగులే చేసింది. హర్షిత్ సమరవిక్రమాతో ఆచితూచి ఆడిన హాసిని పెరెరా(22)ను శ్రీచరణి రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చింది. నిలకడగా ఆడిన హర్షిత అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటైంది. ఆమె వికెట్తో శ్రీలంక ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. కవిష దిల్లారి(14)ని కూడా శ్రీ చరణి ఔట్ చేయడంతో శ్రీలంక కోలుకోలేకపోయింది.