వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలంలో భారీ ధర పలకడంపై తెలుగు తేజం, టీమిండియా స్టార్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి సంతోషం వ్యక్తం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి రావడం మరింత ఆనందాన్నిచ్చిందని తెలిపింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.30 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
గత సీజన్లోనూ శ్రీ చరణి ఢిల్లీ క్యాపిటల్స్కే ఆడింది. రూ. 50 లక్షల భారీ ధరకు ఈ తెలుగు తేజాన్ని ఢిల్లీ కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్ 2025 సీజన్లో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన శ్రీ చరణి.. 4 వికెట్లతో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చింది. ఈ ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికైన శ్రీ చరణి.. వన్డే ప్రపంచకప్లో అద్వితీయమైన బౌలింగ్తో ఆకట్టుకుంది.
లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ 9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచింది. ఈ ప్రదర్శనే వేలంలో శ్రీ చరణి కోట్లు పలికేలా చేసింది.

భారీ ధర పలకడంపై అధికార బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన శ్రీచరణి సంతోషం వ్యక్తం చేసింది. 'వేలంలో భారీ ధర పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. వేలానికి ముందే ఏదో ఓ జట్టు తరఫున నేను ఈ టోర్నీలో భాగమవుతానని ఆశించాను. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీ నాకు హోమ్ టీమ్.ఢిల్లీ జట్టులో మళ్లీ భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. జట్టు విజయాల్లో భాగమయ్యేందుకు, నా సత్తా చూపించేందుకు నాకు దక్కిన మరో అవకాశంగా భావిస్తున్నా. అప్కమింగ్ సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. స్టార్ ఆటగాళ్లతో మా జట్టు బలంగా ఉంది. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా. మేమంతా కలిసి టైటిల్ గెలిచే ప్రయత్నం చేస్తాం.'అని శ్రీచరణి చెప్పుకొచ్చింది.