వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలుస్తుందని స్టార్ స్పిన్నర్, తెలుగు తేజం శ్రీ చరణి జోస్యం చెప్పింది. జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఈ సారి ఢిల్లీ కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేసింది. వరుసగా మూడు సీజన్లలో చేజారిన టైటిల్ను ఈసారి కచ్చితంగా అందిపుచ్చుకుంటామని తెలిపింది.
గత మూడు సీజన్లలో ఢిల్లీని నడిపించిన మెగ్ లాన్నింగ్ యూపీ వారియర్స్కు వెళ్లిపోవడంతో జెమీమా రోడ్రిగ్స్ను కెప్టెన్గా నియమించారు. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారానే ప్రపంచ క్రికెట్కు పరిచయమైన శ్రీ చరణి.. మహిళల వన్డే ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శన కనబర్చి 14 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో శ్రీ చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.30 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

అప్కమింగ్ సీజన్ నేపథ్యంలో ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడిన శ్రీ చరణి ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. తమ కెప్టెన్ జెమీమాపై ప్రశంసల జల్లు కురిపించింది. 'గతేడాదిగా నాకు జెమిమా తెలుసు. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను ఎలా ఆడుతాను? క్లిష్ట పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతాననే విషయం ఆమెకు బాగా తెలుసు.
కాబట్టి మా కమ్యూనికేషన్ చాలా సహజంగా సాగుతుంది. జెమిమాలో నాకు బాగా నచ్చిన గుణం ఏంటంటే ఎదుటివారిని అర్థం చేసుకునే తీరు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు? ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో జెమీమాకు బాగా తెలుసు. ఆమె మాట్లాడే విధానం, ఉత్సాహపరిచే తీరు చాలా ప్రత్యేకం. ఈ ఏడాది మేం కచ్చితంగా ట్రోఫీ గెలుస్తామనే నమ్మకం నాకుంది.
నేను ఒత్తిడి గురించి ఏ మాత్రం ఆలోచించను. నాకు తెలిసిన విషయాలపైనే ఫోకస్ పెడుతాను. నా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. ఫలితం గురించి ఆలోచించను. సహచర భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ మెరుగైన ప్రదర్శనను నేను పోటీగా భావించను. మేమంతా జట్టు కోసమే ఆడుతాం. ఒక రోజు ఆమె రాణిస్తే.. మరో రోజు నేను రాణించవచ్చు. కానీ అది నాకు ముఖ్యం కాదు. జట్టు గెలవడమే నాకు కీలకం.
నా డబ్ల్యూపీఎల్ అరంగేట్రం, ప్రపంచకప్ విజయం తర్వాత చాలా మంది నా ట్రైనర్లు, ఫిజియోలకు ఫోన్ చేసి వారి కుమార్తెలను క్రికెట్ అకాడమీల్లో ఎలా చేర్పించాలో అడగడం మొదలుపెట్టారు. నా విజయం సమాజంపై గట్టి ప్రభావాన్ని చూపిందని నేను భావిస్తున్నా. ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడం మొదలైంది. వారికి మెరుగైన సౌకర్యాలు, అవకాశాలు కల్పించడం కోసం తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. భారత్లో మహిళల క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతోంది.'అని శ్రీ చరణి చెప్పుకొచ్చింది.