టాస్ గెలవడమే..
పాకిస్థాన్, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ల్లో కోహ్లీ టాస్ ఓడిపోవడం ఫలితంపై ప్రభావం చూపింది. చెత్త పిచ్ల కారణంగా టాస్ గెలిచిన జట్లే విజయాన్నందుకున్నాయి. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు టాస్ గెలిచిన జట్లకే అడ్వాంటేజ్ లభించింది. ఈ పరిస్థితుల్లో తాజా టెస్ట్తో రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ టాస్ గెలవడంతో అభిమానులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక భారత్ తరఫున అత్యధికసార్లు టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీనేనంటే నమ్మలేకపోతున్నారు. ఇది నిజమేనా? అని సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు.
అజారుద్దీన్తో సమంగా..
విరాట్ కోహ్లీ తాజా మ్యాచ్తో 29 సార్లు టాస్ గెలవగా.. దిగ్గజ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ సైతం 29 సార్లే గెలిచాడు. తాజా మ్యాచ్తో అజారుద్దీన్ రికార్డు సమం చేశాడు. ఈ జాబితాలో అజారుద్దీన్, కోహ్లీ టాప్లో ఉండగా.. ధోనీ, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనీ 26 సార్లు టాస్ గెలవగా.. సునీల్ గవాస్కర్ 22, సౌరవ్ గంగూలీ 21 సార్లు గెలిచారు. పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే అజారుద్దీన్ 61.7 శాతంతో టాప్లో ఉండగా.. గవాస్కర్ (46.8 శాతం), ధోనీ(43.9 శాతం), గంగూలీ(42.8 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
భారీ స్కోర్ చేస్తాం..
ఇక పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందనే బ్యాటింగ్ తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. విశ్రాంతి అనంతం విరాట్ ఈ మ్యాచ్తోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ రాకతో వైస్ కెప్టెన్ అజింక్యా రహానేపై వేటు పడింది. గత కొంత కాలంగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న రహానేకు టీమ్మేనేజ్మెంట్ ఉద్వాసన పలికింది. ఇక ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు గాయాలతో ఈ మ్యాచ్కు దూరం కాగా.. మహమ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తామని విరాట్ కోహ్లీ తెలిపాడు. పిచ్పై పెద్దగా గడ్డి లేదని, సూర్యుడు కూడా వచ్చాడు కాబట్టి బ్యాటింగ్కు అనుకూలిస్తుందని చెప్పాడు. కాన్పూర్లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నామన్నాడు. అయితే ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ అద్బుతంగా ఆడిందన్నాడు. ఇక మోచేతి గాయంతో కేన్ విలియమ్సన్ దూరం కాగా.. డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు.