గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు క్రేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్తో పాటు విశ్వ వేదికలపై సత్తా చాటిన ప్రతిభావంతులకు పురస్కారాలను ప్రకటించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు నలుగురు ఆటగాళ్లను ఎంపికచేశారు. అయితే క్రికెట్ నుంచి ఒక్క ఆటగాడికి కూడా ఈ అవార్డ్ లభించలేదు.
పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలతో సత్తా చాటిన షూటర్ మను భాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్, భారత పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్కుమార్లు అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికయ్యారు.

టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలవడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాను ఈ అవార్డ్కు ఎంపిక చేయాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు ద్రోణాచార్య అవార్డ్ ఇవ్వాల్సిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
32 మందికి అర్జున అవార్డ్కు ఎంపికవ్వగా.. ఇందులో ఒక్క క్రికెటర్ కూడా లేడు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిస్తే.. కేంద్ర ప్రభుత్వం క్రికెటర్లను పట్టించుకోలేదు. గతేడాది బుమ్రా టెస్ట్ క్రికెట్లో 71 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ 2024లో 15 వికెట్లు పడగొట్టాడు. మెరుగైన ప్రదర్శన చేసిన బుమ్రాను ఖేల్ రత్న అవార్డ్కు ఎంపిక చేయాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
టీ20 ప్రపంచకప్ గెలవడంలో కోచ్గా కీలక పాత్ర పోషించిన రాహుల్ ద్రవిడ్కు ద్రోణాచార్య అవార్డ్ ఇవ్వాల్సిందని కామెంట్ చేస్తున్నారు. క్రీడా అవార్డుల కోసం బీసీసీఐ క్రికెటర్ల పేర్లను రికమెండ్ చేయకుండా ఏం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న: దొమ్మరాజు గుకేశ్(చెస్), హర్మన్ప్రీత్ సింగ్(హాకీ), ప్రవీణ్ కుమార్(పారా అథ్లెటిక్స్), మను భాకర్(షూటింగ్)
అర్జున అవార్డ్: యర్రాజి జ్యోతి, అన్నురాణి(అథ్లెటిక్స్), నీతు సావీటీ బూరా(బాక్సింగ్), వంతిక అగర్వాల్(చెస్), సలీమా టెటె, అభిషఏక్, సంజయ్, జర్మన్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్(హాకీ), రాకేశ్ కుమార్(పారా ఆర్చరీ), జీవాంజి దీప్తి, ప్రీతి పాల్, అజీత్ సింగ్, సచిన్ సార్జేరావ్ ఖిలారి, ధరమ్ బీర్, ప్రణవ్ సూర్మా, హొకాటో సేమా, సిమ్రన్, నవదీప్(పారా అథ్లెటిక్స్), నితీష్ కుమార్, తులసిమతి మురుగేశన్, నిత్యశ్రీ సుమతి శివన్, మనీషా రాందాస్(పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్, మోనా అగర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్, స్వప్నిల్, అభయ్ సింగ్, అమన్ సెహ్రావత్(రెజ్లింగ్)
ద్రోణా చార్య: సుభాష్ రాణా(పారా షూటింగ్), దీపాలి దేశ్పాండే(షూటింగ్), సందీప్ సాంగ్వాన్(హాకీ)