హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ గతేడాదిగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఇటు సానియా.. అటు షోయబ్ మాలిక్ ఖండించలేదు.
ఈ ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, వ్యాపార ఒప్పందాల్లో భాగంగా ఈ విషయాన్ని బహిర్గతం చేయడం లేదని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా షోయబ్ మాలిక్ తన బయోను మార్చడంతో మరోసారి విడాకుల వ్యవహారం చర్చనీయాంశమైంది.

గతంలో షోయబ్ మాలిక్ తన బయోలో 'అథ్లెట్, సూపర్వుమన్ సానియా మీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని'అని ఉండేది. అయితే, ఇప్పుడు దాన్ని మాలిక్ మార్చేశాడు. సూపర్ వుమన్ సానియా మీర్జాకు భర్తను అన్న పదాన్ని తొలగించి.. 'ఓ బిడ్డకు తండ్రి..' అన్న పదాన్ని మాత్రమే ఉంచాడు.
దీంతో వీరి విడాకులు తీసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2010లో హైదరాబాద్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. 2018లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు.
సాఫీగా సాగుతున్న వీరి వివాహ బంధాన్ని అక్రమ సంబంధం దెబ్బతీసిందనే ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్ మోడల్ అయేషాతో మాలిక్ సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నాడని, ఈ విషయం తెలుసుకున్న సానియా అతనికి చెప్పా పెట్టకుండా భారత్కు వచ్చేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ యాడ్ షూటింగ్లో భాగంగా అయేషాతో మాలిక్ బోల్డ్గా ఫొటోలు దిగడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.
ఈ వార్తలను అయేషా ఖండించినప్పటికీ ఈ ప్రచారం ఆగలేదు. మాలిక్ అక్రమ సంబంధంతో సానియా బాగా హర్ట్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ముస్లింలు ఎంతో ఘనంగా జరుపుకునే ఈద్ పండుగ వేళ కూడా ఇద్దరూ వేరువేరు చోట్ల ఉండటం, ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సానియా ఫేర్ వెల్ మ్యాచ్ కు మాలిక్ హాజరుకాకపోవడం వంటి అంశాలు కూడా వీరి విడాకుల రూమర్స్కు బలం చేకూర్చాయి.