'ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను తీసుకోవడం లేదు.. కాకా పట్టినోడికే జట్టులో చోటు'

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ దేశ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టులో పక్షపాతం బాగా పెరిగిపోయిందన్నాడు. పీసీబీ సెలెక్టర్లు ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం లేదని, పరిచయాలు ఉన్నోడికే చోటిస్తారన్నాడు. ఇటీవల జింబాబ్వేలో ముగిసిన టెస్ట్ సిరీస్ కోసం ఆటగాళ్లను ఎంపికచేయడంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ సూచనలను పీసీబీ సెలక్షన్ కమిటీ విస్మరించిందని మాలిక్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు తాజాగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే.

నచ్చడం, నచ్చకపోవడం ఉంది
తాజాగా షోయబ్ మాలిక్ పాక్ ప్యాషన్.నెట్తో మాట్లాడుతూ.. జట్టు ఎంపిక పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరగాలని, కెప్టెన్ బాబర్ అజామ్ తన జట్టును ఎన్నుకోవటానికి స్వేచ్ఛా హస్తం పొందాలని అన్నాడు. 'మన క్రికెట్లో (పాక్) నచ్చడం, నచ్చకపోవడం అనే పద్దతి ఉంది. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఉంది కానీ మన దగ్గర ఇది ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. నైపుణ్యాలకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే మన క్రికెట్లో మార్పులు వస్తాయి. ఇది నిజం. అంతర్జాతీయ జట్టు అంటే.. ఎంతో పటిష్టంగా ఉండాలి. జట్టు ఎంపిక పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరిగితేనే అది సాధ్యం అవుతుంది' అని మాలిక్ అన్నాడు.

తుది నిర్ణయం కెప్టెన్ తీసుకోవాలి
'ఇటీవలి జట్టులో బాబర్ ఆజమ్ ఎంచుకోవాలనుకున్న చాలా మంది ఆటగాళ్లు ఎంపిక చేయబడలేదు. ప్రతి ఒక్కరికీ వారి అభిప్రాయాలు ఉంటాయి. కాని జట్టు ఎంపికపై తుది నిర్ణయం కెప్టెన్ తీసుకోవాలి. ఎందుకంటే అతను మైదానంలో పోరాడతాడు. ఆటగాళ్ల ఎంపికలో బోర్డులో పక్షపాత ధోరణి నడుస్తుంది. ఇది సరైనది కాదు. పీఎస్ఎల్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి. కనీసం రెండు సీజన్ల పాటు అందులో ఆడే ఆటగాళ్లను పరిశీలించి అప్పుడు జట్టులోకి తీసుకోవాలి. అప్పుడే జట్టులోకి నాణ్యమైన ఆటగాళ్లు వస్తారు' అని పాక్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు.
నా రోల్మోడల్ 2-3 ఏళ్లు మాట్లాడలేదు.. ఆ ఘటన నన్ను చాలా బాధించింది: ఉతప్ప

ఆడనివ్వకపోయినా సరే
'ఈ విషయాన్ని బయటపెట్టడం వల్ల నాకే నష్టం జరిగినా పరవాలేదు. నన్ను మళ్లీ టీ20ల్లో ఆడనివ్వకపోయినా.. నేనేమి బాధపడను. నేను ఇప్పటివరకు ఎంతోమంది కెప్టెన్లతో ఆడాను. వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్, ఇంజమామ్, షాహిద్ అఫ్రిది లాంటి దిగ్గజాలతో ఆడాను. కెప్టెన్గా ఉండాలంటూ ఇతరులను కాకా పట్టడం చేయొద్దు. అలా చేయకుండా ఉంటే తప్పకుండా గొప్ప కెప్టెన్గా మిగిలిపోతారు' అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ చెప్పుకొచ్చాడు. మాలిక్ తన చివరి టీ20ని ఇంగ్లాండ్పై గత ఏడాది సెప్టెంబర్లో ఆడాడు. ఇక 2019 జూన్లో టీమిండియాపై చివరిసారి వన్డే మ్యాచ్ ఆడాడు.

వన్డే, టెస్టులకి రిటైర్మెంట్
వన్డే, టెస్టులకి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన షోయబ్ మాలిక్.. టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున 35 టెస్ట్ మ్యాచ్లు, 287 వన్డేలు, 116 టీ20 మ్యాచ్లు ఆడాడు. వరుసగా 1898, 7534, 2335 రన్స్ చేశాడు. ఇక 218 వికెట్లు కూడా పడగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 12 శతకాలు చేశాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని మాలిక్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications