సానియా మీర్జాను పెళ్లిచేసుకున్నానని ఏనాడు బాధపడలేదు: షోయబ్ మాలిక్

హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నానని ఏనాడు బాధపడ లేదని పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తెలిపాడు. అలా బాధపడటానికి తానేమి రాజకీయనాయకుడి కాదని, క్రికెటర్ను మాత్రమేనని స్పష్టం చేశాడు. అభిమానులు తీవ్ర నిరసనల మధ్య భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను షోయబ్ మాలిక్ పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. 2008 ఏప్రిల్ 12న హైదరాబాద్ వేదికగా అత్యంత వైభవంగా వీరి వివాహం జరగగా.. 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించిన విషయం తెలిసిందే.

సానియాపై ట్రోలింగ్..
అయితే భారత్ పాకిస్తాన్ల మధ్య ఎలాంటి గొడవలు జరిగినా, ఆఖరికి క్రికెట్ మ్యాచ్ జరిగినా కొంత మంది అభిమానులు ఈ జంటను టార్గెట్ చేస్తుంటారు. ముఖ్యంగా సానియానుద్దేశించి తీవ్ర ట్రోలింగ్కు పాల్పడుతుంటారు. అయితే తమ పెళ్లై 12ఏళ్లు గడుస్తున్నప్పటికీ సానియాను తాను పెళ్లి చేసుకోవడంపై వస్తున్న అనేక వార్తలపై మాలిక్ తాజాగా స్పందిస్తూ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో సానియాను పెళ్లి చేసుకున్నానని ఏ రోజు విచారం వ్యక్తం చేసింది లేదన్నాడు.

దేశంతో సంబంధం లేదు..
‘ఏ రోజు అలాంటి భావనరాలేదు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు.. వారి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశం, ఆ కంట్రీతో మనదేశ సంబంధాలు ఎలా ఉన్నాయి.? రాజకీయ పరిస్థితులు బాగున్నాయా? అని ఎవరం పట్టించుకోం. పట్టించుకోవాల్సి అవసరం కూడా లేదు. ఒకరికొకరు నచ్చామా? అర్థం చేసుకున్నామా? ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయా? అనే విషయాల గురించి ఆలోచించాలి. భారత్లో నాకు చాలా మంది మంచి స్నేహితులున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ఏనాడు ఆందోళన చెందలేదు. అయినా నేనో క్రికెటర్. రాజకీయనాయకుడిని కాదు'అని మాలిక్ చెప్పుకొచ్చాడు.

ఐదు నెలల తర్వాత సానియా దగ్గరకు..
కరోనా లాక్డౌన్ కారణంగా షోయబ్ మాలిక్ పాకిస్తాన్లో ఉండిపోగా సానియా మీర్జా, ఇజాన్లు హైదరాబాద్లో ఉన్నారు. దీంతో గత ఐదు నెలలుగా భార్య, బిడ్డలకు మాలిక్ దూరమయ్యాడు. ఇక పాకిస్థాన్.. ఇంగ్లండ్ పర్యటకు పీసీబీ ప్రకటించిన 29 సభ్యుల్లో షోయబ్ మాలిక్ కూడా ఉన్నాడు. ఈ నెలాఖరులో పాక్.. ఇంగ్లండ్కు వెళ్లాల్సి ఉంది. అయితే కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్కు ఆలస్యంగా వెళ్తానని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు. దీనికి పీసీబీ కూడా అంగీకరించడంతో షోయబ్ భారత్కు రానున్నాడు. సుమారు ఓ నెలరోజుల పాటు భార్య, బిడ్డతో ఉండనున్నాడు.

జూలై 24న ఇంగ్లండ్కు..
ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడిన పీసీబీ.. కుటుంబంను కలిసేందుకు షోయాబ్కు అనుమతిని ఇచ్చింది. 'కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణ నిషేధంతో షోయబ్ దాదాపు ఐదు నెలలుగా తన కుటుంబాన్ని చూడలేదు. ప్రయాణ ఆంక్షలు ఇప్పుడు క్రమంగా తొలగిస్తున్నందున కుటుంబంతో కలిసేందుకు అవకాశం ఉంది. ఇదే విషయంపై ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడగా.. వారు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. జూలై 24 న షోయబ్ను దేశంలోకి రానిచ్చేందుకు అంగీకరించారు' అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
2023 ప్రపంచకప్ ఆడటమే నా లక్ష్యం: శ్రీశాంత్