ఆసియా కప్ 2025 టోర్నీలో మరోసారి భారత్, పాకిస్థాన్ జట్లు తలపడున్నాయి. ఇరు జట్లు ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే దాయాదీ దేశాలు రెండు సార్లు తలపడ్డాయి. అయితే ఈ రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్థాన్ను భారత్ చిత్తు చేసింది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. రెండో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడించింది. ముచ్చటగా మూడోసారి భారత్, పాక్లు ఫైనల్లో తలపడుతున్నాయి.
ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాక్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఫైనల్లో భారత్ను ఓడిస్తామని పాకిస్థాన్ ఆటగాళ్లు సవాల్ విసిరారు. దాంతో ఈ మ్యాచ్పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారత్ను ఓడించడం పాకిస్థాన్కు చాలా కష్టమని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. అయితే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను త్వరగా ఔట్ చేస్తే భారత్ను ఓడించవచ్చని పాక్ ఆటగాళ్లకు సూచించాడు. 'భారత్తో మ్యాచ్ అనగానే ఒత్తిడికి గురయ్యే మైండ్సెట్ నుంచి పాకిస్థాన్ ఆటగాళ్లు బయటకు రావాలి. బంగ్లాదేశ్పై ఎలా ఆడారో అలాగే భారత్ను ఓడించాలి. మొత్తం 20 ఓవర్లూ బౌలింగ్ చేయకుండా.. 10 వికెట్లు తీసేందుకు ప్రయత్నించాలి.

ముఖ్యంగా అభిషేక్ శర్మను తొలి మూడు ఓవర్లలోనే ఔట్ చేయాలి. అప్పుడే భారత్పై ఒత్తిడి పెట్టవచ్చు. భారత్కు ఇప్పటి వరకు వచ్చిన ఆరంభాలన్నీ అభిషేక్ శర్మ అందించినవే. అభిషేక్ శర్మను ఔట్ చేయకపోతే మాత్రం పాకిస్థాన్ గెలవడం కష్టం. అభిషేక్ తప్పిదం చేయడం కూడా చాలా తక్కువ. కాబట్టి అతనిపై అటాకింగ్ బౌలింగ్ చేయాలి. అప్పుడే మిగతా భారత్ బ్యాటర్లు ఆచితూచి ఆడేందుకు ప్రయత్నిస్తారు. పరుగుల కోసం కష్టపడుతారు.
అయితే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. పాక్పై టాప్ క్లాస్ ఆటను ఆడాలని భారత్కు చెబుతాడు. చెత్త జట్టుతో దిగినా.. నాసికరంగా ఆడినా.. పాక్ ఫైనల్ చేరుకుంది. తుదిపోరులో మాత్రం దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నా.'అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.