
కరాచీ: టీ20 ప్రపంచకప్లో టీమిండియా దారుణ ప్రదర్శన నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో రెండు గ్రూప్లు ఏర్పడ్డాయని, ఒకటి కెప్టెన్ కోహ్లీ వైపు మొగ్గు చూపుతుంటే.. మరొకటి అతనికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పాడు. న్యూజిలాండ్తో కీలక పోరులో విరాట్ కోహ్లీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అతడో గొప్ప క్రికెటర్ అని, అతన్ని గౌరవించాలని ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అక్తర్.. న్యూజిలాండ్తో మ్యాచ్లో భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ నచ్చలేదన్నాడు. టాస్ ఓడిపోగానే మ్యాచ్ కోల్పోయినట్ల ప్రవర్తించారని తెలిపాడు. జట్టుగా సరైన ప్రణాళికలతో బరిలోకి దిగలేదన్నాడు.
'టీమిండియాలో నాకు రెండు గ్రూప్స్ కనబడుతున్నాయి. ఒకటి కోహ్లీ వైపు ఉంటే.. మరొకటి అతని వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది వారి ఆట తీరును బట్టే అర్థమవుతుంది. టీమ్ రెండుగా విడిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియదు. బహుషా కెప్టెన్గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కావడం వల్ల ఆటగాళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారేమో. అతను కెప్టెన్గా తప్పిదాలు చేసుండొచ్చు. కానీ కోహ్లీ చాలా గొప్ప క్రికెటర్. అతన్ని గౌరవించాలి. న్యూజిలాండ్లో భారత్ చెత్తగా ఆడింది కాబట్టి వారిని విమర్శించడం కరెక్టే. వారిలో గెలవాలనే అటిట్యూడ్ లేదు. టాస్ ఓడిపోగానే మ్యాచ్ కోల్పోయినట్లు ఆడారు. ప్రతీ ఒక్కరిలో గెలవాలనే తెగింపు కనబడలేదు. ఎలాంటి గేమ్ ప్లాన్ లేకుండా బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్నారు. టాస్ ఓడిపోతే మ్యాచ్ కోల్పోయినట్లు కాదు కదా. ఆటగాళ్లు పోరాడాల్సింది.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ పీటర్సన్ టీమిండియాకు అండగా నిలుస్తూ ట్వీట్ చేశాడు. ఏ ఆటగాడూ కూడా ఓడాలని బరిలోకి దిగడని, గెలిచేందుకే ప్రయత్నిస్తాడని పేర్కొన్నాడు. 'ఆటలో ఒకరు విజేతగా నిలిస్తే మరొకరు ఓటమిపాలవుతారు. ఎవరూ ఓడాలని బరిలోకి దిగరు. దేశం తరఫున ఆడటం అనేది అన్నిటికన్నా గొప్ప గౌరవం. జట్టులోని ఆటగాళ్లు రోబోలు కాదనే విషయాన్ని మీరంతా గుర్తించాలి. ఎల్లప్పుడూ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ మద్దతు తెలపాలి' అని పీటర్సన్ టీమిండియా అభిమానులకు సూచించాడు.