టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్పై పాకిస్థాన్ దిగ్గజ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 20 ఏళ్లు గడిచినా.. సెహ్వాగ్ ఇంకా ముల్తాన్ టెస్ట్ ట్రిపుల్ సెంచరీ గురించే మాట్లాడుతున్నాడని, పదే పదే ఆ ట్రిపుల్ సెంచరీ గురించి విని విసిగిపోయానని తెలిపాడు. 300 పదాన్ని ఎక్కువ సార్లు చెప్పిన వ్యక్తిగా సెహ్వాగ్కు గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవ్వాలని సెటైర్లు పేల్చాడు. ఇకనైనా ఈ ట్రిపుల్ సెంచరీ గురించి మాట్లాడటం ఆపేయాలని అక్తర్ హితవు పలికాడు.
2004 పాకిస్థాన్ పర్యటనలో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్లో సెహ్వాగ్ (375 బంతుల్లో 39 ఫోర్లు 6 సిక్సర్లతో 309) ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో షోయబ్ అక్తర్తో పాటు ఇతర పాకిస్థాన్ బౌలర్లు అయిన మహమ్మద్ షమీ, అబ్దుల్ రజాక్, సక్లైన్ ముస్తాక్లను సెహ్వాగ్ చితక్కొట్టాడు. ఈ ట్రిపుల్ సెంచరీ గురించి సెహ్వాగ్ పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటాడు. తాజాగా ఓ ప్రకటనలోనూ ఈ ట్రిపుల్ సెంచరీ ప్రస్తావన తీసుకొచ్చాడు. దాంతో షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'నేను సెహ్వాగ్ పాజీ యాడ్ వీడియో చూశాను. గత 20 ఏళ్లుగా అతను 300 గురించే మాట్లాడుతున్నాడు. అతను పదే పదే ట్రిపుల్ గురించి మాట్లాడటం విని విసిగిపోయాను. సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ చేసినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఆ మ్యాచ్లో సెహ్వాగ్ బాగా ఆడాడు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది ఉపవాసం ఉన్న నెల (రంజాన్ మాసం). నాలుకను నియంత్రించుకోవాలి.
దయచేసి ఇక ట్రిపుల్ సెంచరీ గురించి మాట్లాడటం ఆపేయండి. '300' అని అత్యధిక సార్లు ప్రస్తావించినందుకు సెహ్వాగ్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి. ప్రపంచంలోనే అత్యధిక సార్లు 300 అని చెప్పిన ఏకైన వ్యక్తి వీరేంద్ర సెహ్వాగ్ అని గిన్నిస్ రికార్డ్లో చేర్చాలి. ఆయన గిన్నిస్ రికార్డ్ కోరుకుంటే నేను ఎక్కిస్తాను.'అని షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.