కొలంబో: భారత్-శ్రీలంక మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ పాకిస్థాన్ అభిమానులు చేసిన ఆరోపణలపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. చెత్త వాగుడు ఆపి ఆటను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలని హితవు పలికాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా 41 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి 213 పరుగులకే కుప్పకూలారు. పాకిస్థాన్పై సెంచరీల మోత మోగించిన భారత ఆటగాళ్లు.. శ్రీలంకపై దారుణంగా విఫలమవడంతో మ్యాచ్ ఫిక్స్ చేశారని ఆ దేశ అభిమానులు ఆరోపించారు. పాకిస్థాన్ ఫైనల్కు రావద్దని టీమిండియా కావాలనే ఓడిపోతుందని కామెంట్ చేశారు.

బ్యాటింగ్లో విఫలమైనా.. బౌలింగ్లో సత్తా చాటిన భారత్ అసాధారణ విజయాన్ని అందుకుంది. దాంతో పాక్ అభిమానులు నోరు మూసుకున్నారు. ఈ ట్రోలింగ్పై షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. 'అసలు పాకిస్థాన్ అభిమానులకు ఏమైందో అర్థం కావడం లేదు. భారత్ మ్యాచ్ ఫిక్స్ చేసిందంటూ మీమ్స్ ట్రెండ్ చేశారు.
పాకిస్థాన్ను ఫైనల్ రాకుండా అడ్డుకోవాలనే టీమిండియా ఇలా చేసిందని ఆరోపించారు. ఈ మీమ్స్ చూశాక.. వీళ్లంతా బాగానే ఉన్నారా? అనే సందేహం కలిగింది. శ్రీలంక బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో భారత్ను కట్టడి చేస్తే ఫిక్సింగ్ అని ఆరోపించడం భావ్యమేనా? 20 ఏళ్ల వెల్లలాగే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బౌలింగ్లో ఐదు వికెట్లు తీసిన అతను బ్యాటింగ్లో 43 పరుగులు చేశాడు.
విజయం కోసం శ్రీలంక తీవ్రంగా పోరాడింది. మరోవైపు భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి తన జట్టును గెలిపించాడు. రెండుజట్ల మధ్య జరిగిన పోరు అద్భుతంగా ఉంది. పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు మాత్రం పోటీనివ్వలేకపోయారు. మన ఫాస్ట్బౌలర్లు సరిగ్గా ఆడలేదు. అలాంటప్పుడు ఇలాంటి ఫిక్సింగ్ మాటలు ఎలా చెప్పగలం..? అయితే, తప్పకుండా పాక్ పుంజుకుంటుందనే ఆశాభావం ఉంది' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
శ్రీలంకపై విజయంతో టీమిండియా ఫైనల్ బెర్త్ ఖరారు కాగా.. బంగ్లాదేశ్పై గెలిచిన శ్రీలంక, పాకిస్థాన్ మరో బెర్త్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే ఫైనల్కు చేరనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం మెరుగైన రన్ రేట్ ఉన్న శ్రీలంక టోర్నీలో ముందంజ వేస్తోంది.
పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లాదేశ్ ఇప్పటికే ఇంటిదారి పట్టింది. ఆసియా కప్ ఫైనల్లో ఇప్పటి వరకు దాయాదీ దేశాలు తలపడలేదు. దాంతో ఈ సారి పాకిస్థాన్ ఫైనల్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.