న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్కు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మ్యాచ్కు తెరలేవనుంది. కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు ముందు పాకిస్థాన్ పేసర్లను ఆ దేశ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ హెచ్చరించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాత్రం పెట్టుకోవద్దని సూచించాడు. బౌలర్లు ఎక్కువగా విరాట్ కోహ్లీతో మాట్లాడవద్దని, అతన్ని ఒత్తిడిలోకి నెట్టి, ఆటపై ఫోకస్ కోల్పోయేలా చేయాలన్నాడు. అలా కాకుండా అతనితో వాగ్వాదానికి దిగితే చుక్కలు చూపిస్తాడని వార్నింగ్ ఇచ్చాడు. ఓ చానెల్ చర్చ కార్యక్రమంలో పాల్గొన అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'ఏ బౌలర్ కూడా విరాట్ కోహ్లీతో మాట్లాడవద్దు. అతనిపై ఒత్తిడి పెంచుతూ ఆటపై దృష్టి కోల్పోయేలా చేయాలి. అతను రిథమ్ అందుకుంటే మాత్రం మిమ్మల్ని ఆడుకుంటాడు. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపిస్తాడు'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
షాహిన్ అఫ్రిది అసాధారణమైన బౌలరే అయినప్పటికీ అతని బౌలింగ్లో దూకుడు కనిపించడం లేదని చెప్పాడు. గంటకు 135 కిలోమీటర్లతో బౌలింగ్ చేసినా.. 145 కిలో మీటర్ల వేగంతో వేసినట్లు దూకుడు కనబర్చాలన్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించాలని చెప్పాడు. అలా చేయడం వల్ల విమర్శలు వచ్చినా పట్టించుకోవద్దన్నాడు. క్రీడల్లో గొడవలు సహజమని చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ 2023లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడిన కోహ్లీకి పాకిస్థాన్పై మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 4 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే నేడు జరిగే మ్యాచ్లో కోహ్లీ చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నేటి మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్కు రిజర్వ్డే కేటాయించారు.